Reading Time: < 1 minute

284కే శ్రీలంక ఆలౌట్.. 178 పరుగుల లీడ్‌లో భారత్.. గాలేలో టీమిండియా జోరు!

Caption of Image.

IND vs SL: శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి మ్యాచ్‌పై భారత్ పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆతిథ్య శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌట్ కావడంతో టీమిండియాకు 178 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం (Lead) లభించింది. ఒక దశలో 90 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడిన శ్రీలంకను మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఆదుకోవడంతో లంక ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. అంతకుముందు రోజు ప్రారంభంలో భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.

డిక్వెల్లా, దినుషా 146 రన్స్ పార్టనర్‌షిప్: 

90/5తో పేకమేడలా కూలిపోయేలా కనిపించిన శ్రీలంక ఇన్నింగ్స్‌ను నిరోషన్ డిక్వెల్లా, సోనాల్ దినుషల జోడీ బాధ్యతాయుతంగా ముందుకు నడిపించింది. ఈ ఇద్దరు లెఫ్ట్‌హాండ్ బ్యాటర్లు భారత బౌలర్లను నిరోధిస్తూ ఆరో వికెట్‌కు ఏకంగా 146 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని భారత్ ఎట్టకేలకు విడదీసింది. డిక్వెల్లా 80 పరుగుల దగ్గర అవుట్ కాగా, మరోవైపు నిలకడగా ఆడిన సోనాల్ దినుష టెస్టుల్లో తన తొలి సెంచరీ (Maiden Test Hundred) సాధించి లంక ఇన్నింగ్స్‌కు గౌరవప్రదమైన స్కోరును అందించాడు.

►ALSO READ | 4000+ పరుగులు, 350 వికెట్లతో జడేజా సరికొత్త చరిత్ర: ప్రపంచ క్రికెట్‌లో ఆ నలుగురిలో ఒకడిగా రికార్డు!

మానవ్ సుతార్ 4 వికెట్లు.. జడేజా ఆల్‌టైమ్ రికార్డు:

భారత బౌలింగ్ విభాగంలో యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ 4 వికెట్లతో లంక బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీయగా, స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 3 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో జడేజా టెస్టు క్రికెట్ చరిత్రలోనే 4,000 కి పైగా పరుగులు సాధించడంతో పాటు 350 వికెట్లు పడగొట్టిన నాల్గో అంతర్జాతీయ ఆల్‌రౌండర్‌గా నిలిచి అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. మూడో రోజు ఆట ముగిసేసరికి లంకను ఆలౌట్ చేసిన భారత్, నాలుగో రోజు 178 పరుగుల ఆధిక్యంతో పూర్తి ధీమాగా బరిలోకి దిగనుంది. 

©️ VIL Media Pvt Ltd.