
వైసీపీ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు ఆ జిల్లా పార్టీలో అశాంతికి కారణం అవుతున్నాయా? ఒక సమస్య పరిష్కారానికి నిర్ణయం తీసుకుంటే దానికి అనుబంధంగా మరొకటి వస్తోందా? మమ్మల్ని కావాలనే టార్గెట్ చేస్తున్నారని ఓ వర్గం అనుకోవడానికి కారణం ఏంటి? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? ఫ్యాన్ పార్టీ గట్టిగా ప్రభావం చూపించే జిల్లాల్లో ఉమ్మడి నెల్లూరు మొదటి వరుసలో ఉంటుంది. కానీ… పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పిదాలతో గత ఎన్నికల్లో ఘోరమైన ఫలితాలను చూడాల్సి వచ్చిందని వైసీపీ వర్గాలే చెబుతాయి. ప్రస్తుతం చేస్తున్న వివిధ పోరాటాలతో తిరిగి జనంలోకి వెళ్ళ గలుగుతున్నామని స్థానిక నేతలు భావిస్తున్న టైంలో… పెద్దలు తీసుకుంటున్న నిర్ణయాలతో వాళ్ళు రగిలిపోతున్నారట. కష్టపడి పని చేసే వారిని పక్కన పెట్టేస్తున్నారన్న టాక్ నడుస్తోంది.
బ్యాక్ గ్రౌండ్ బలంగా ఉంటేనే వైసీపీలో పదవులు నిలబడతాయన్న గుసగుసలు సైతం ఉన్నాయి. ఇటీవల గూడూరు నియోజక వర్గ ఇన్ఛార్జ్గా ఎమ్మెల్సీ మేరిగ మురళిని మార్చింది అధిష్టానం. ఆయనకు బదులు గురవయ్యకు అవకాశం ఇచ్చింది. మురళి గూడూరు ఇంచార్జ్గా ఉన్నప్పుడు ఆయన్ని తప్పించాలని రెడ్డి సామాజిక వర్గం కీలక నేతలంతా కలిసి డిమాండ్ చేశారట. ఆ క్రమంలోనే తప్పించి గురవయ్యకు ఛాన్స్ ఇచ్చారని అంటారు. కానీ.. ఇప్పుడు ఆయన్ని కూడా కొందరు వ్యతిరేస్తున్నారట. MLC మురళితో జత కట్టి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో మురళిని శాంతింపచేసే ప్రయత్నంలో భాగంగా ఆయన కొడుక్కి ఏదో ఒక పదవి ఇవ్వాలని అధిష్టానం భావించింది. ఇంచార్జ్ పోస్ట్ తీసేసే సమయంలో తన కొడుక్కి ఆ పోస్ట్ ఇవ్వమని మురళి అధిష్టానాన్ని కోరారట.
కానీ… అది వర్కౌట్ కాలేదు. అందుకే… ఇప్పుడు పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ కుమారుడు డాక్టర్ రేవంత్ చక్రవర్తిని నియమించారట. కానీ… ఒక సమస్యని పరిష్కరించడానికి నిర్ణయం తీసుకుంటే మరో రకమైన ప్లాబ్లం వచ్చింది. ఇన్నాళ్లు నెల్లూరు సిటీ నియోజకవర్గానికి చెందిన ఊటుకూరు నాగార్జున జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్నారు. ఏళ్ళుగా పని చేస్తున్న నాయకుడిని ఉన్నఫళంగా, ఏ కారణం లేకుండా ఆ పదవి నుంచి తీసేసి వేరొకరికి ఎలా ఇస్తారంటూ పార్టీలోనే ప్రశ్నలు వస్తున్నాయి. పార్టీలో చురుకైన నేతను తప్పించి ఎమ్మెల్సీని సంతృప్తి పరచడానికి ఆయన కొడుక్కి పదవి ఎలా ఇస్తారని అడుగుతున్నారు కార్యకర్తలు.
పదవి నుంచి తప్పించే ముందు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని.. నాగార్జున తీవ్ర అవేదనతో ఉన్నట్టు తెలిసింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీని సంతృప్తి పరిచేందుకు అదే సామాజిక వర్గానికి చెందిన నాగార్జునకు పార్టీ వెన్నుపోటు పొడిచిందన్న ప్రచారం జిల్లాలో నడుస్తోంది. తాను రాజకీయ ఊడిగం చెయ్యలేదన్న కారణంతోనే కొందరు కుట్రలు చేసి పదవి నుంచి తప్పించారని ఇండైరెక్ట్ గా సిటీ ఇంచార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ను ఉద్దేశించి నాగార్జున అన్నట్టు చెప్పుకుంటున్నారు. తాను మాజీ మంత్రి అనిల్ వర్గం కావడంతోనే ఇలా జరిగిందని అంటున్నారట. ఇటీవల కాలంలో వైసీపీ అధిష్టానం తీసుకున్న రెండు నిర్ణయాలు ఎస్సీ సామాజిక వర్గం మీద ప్రభావం పడేవి కావడంతో… టీడీపీ కార్నర్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. పార్టీ బలోపేతం కోసం అధిష్టానం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోక తప్పదుగానీ…. వాటి పర్యవసానాల గురించి కూడా ఆలోచించి రాంగ్ ఇండికేషన్స్ వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కదా అంటున్నారు జిల్లా లీడర్స్. ఒకర్ని సంతృప్తి పరిచేందుకు మరొకరికి కత్తిపోట్లు ఏంటన్న చర్చ సింహపురి వైసీపీలో జరుగుతోంది.