Reading Time: < 1 minute

యూజీసి నెట్ రీఎగ్జామ్..మూడు పేపర్లకు మళ్లీ పరీక్ష

Caption of Image.

UGC-NET జూన్ 2026 పరీక్షల్లో ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ ప్రశ్నపత్రాల్లో భారీగా లోపాలు ఉన్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. జూన్ 22 నుంచి 30 వరకు 87 సబ్జెక్టుల్లో పరీక్షలు నిర్వహించగా, ఈ మూడు పేపర్లపై అభ్యర్థుల నుంచి పలు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో NTA ఏర్పాటు చేసిన కమిటీ ప్రశ్నపత్రాలను పరిశీలించింది.

ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ పేపర్లలో వాస్తవ, టైపింగ్, అనువాద తప్పులు, ప్రముఖుల పేర్లలో పొరపాట్లు, పుస్తకాల పేర్లలో లోపాలు, ప్రశ్నల రూపకల్పనలో తప్పులు, వ్యాకరణ దోషాలు, విరామ చిహ్నాల సమస్యలు, ప్రామాణికం కాని పదాల వినియోగం ఉన్నట్లు కమిటీ గుర్తించింది. గతంలో అడిగిన ప్రశ్నలు కూడా గణనీయంగా పునరావృతమైనట్లు తేలింది. ఈ లోపాలను ప్రశ్నలు తొలగించడం ద్వారా సరిచేయడం సాధ్యం కాదని, న్యాయమైన పరీక్ష కోసం మూడు పేపర్లను మళ్లీ నిర్వహించాలని కమిటీ సిఫార్సు చేసింది.

దీంతో ఇంగ్లీష్, కామర్స్ పరీక్షలను సెప్టెంబర్ 9న, సోషియాలజీ పరీక్షను సెప్టెంబర్ 10న నిర్వహించనున్నారు. ఇంగ్లీష్, సోషియాలజీ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, కామర్స్ పరీక్ష మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. పరీక్ష కేంద్రాలు, అడ్మిట్ కార్డు వివరాలను NTA తర్వాత ప్రకటించనుంది. రీ-ఎగ్జామ్‌కు అదనపు ఫీజు ఉండదు.

మిగిలిన 84 సబ్జెక్టుల ఫలితాలు షెడ్యూల్ ప్రకారం విడుదలవుతాయని, JRF, అసిస్టెంట్ ప్రొఫెసర్, PhD ప్రవేశాలకు సంబంధించిన ప్రక్రియపై ఈ రీ-ఎగ్జామ్ ప్రభావం ఉండదని NTA స్పష్టం చేసింది.

©️ VIL Media Pvt Ltd.