
ICC ODI World Cup 2027: రాబోయే 2027 వన్డే ప్రపంచకప్ను అపూర్వంగా తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) సన్నాహాలు ముమ్మరం చేసింది. క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత సుదీర్ఘంగా సాగనున్న ఈ మెగా టోర్నీకి, మన జాతిపిత మహాత్మా గాంధీకి ఒక ఆసక్తికరమైన అనుబంధం ముడిపడి ఉండటం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
వరల్డ్ కప్ షెడ్యూల్లో అనూహ్య మార్పు..
వచ్చే ఏడాది జరగనున్న ఈ మహా క్రికెట్ సంగ్రామానికి ఆఫ్రికా ఖండం వేదిక కాబోతోంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఈ 2027 వన్డే ప్రపంచకప్నకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. వాస్తవానికి ఈ టోర్నీని ముందుగా అక్టోబర్ 8వ తేదీన అట్టహాసంగా ప్రారంభించాలని ఐసీసీ ప్రాథమికంగా ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. కానీ ఇప్పుడు ఆ తేదీని అక్టోబర్ 2వ తేదీకి మార్చే ఆలోచనలో బోర్డు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కేవలం ఒకే ఒక ప్రత్యేక కారణం వల్లే ఈ నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.
బాపూజీకి.. ఆఫ్రికాకు ఉన్న కనెక్షన్ ఇదే..!
క్రికెట్ అనగానే మనకు సచిన్, ధోనీ, కోహ్లీ లాంటి దిగ్గజాలు గుర్తొస్తారు. మహాత్మా గాంధీ ఎప్పుడూ ప్రొఫెషనల్ క్రికెట్ ఆడిన దాఖలాలు లేవు. మరి ఆయన జయంతి రోజున (అక్టోబర్ 2) అంతర్జాతీయ క్రికెట్ మండలి ఈ ప్రతిష్టాత్మక టోర్నీని ఎందుకు ప్రారంభించాలనుకుంటోందనే సందేహం రాక మానదు. దీనికి అసలు కారణం దక్షిణాఫ్రికాతో బాపూజీకి ఉన్న విడదీయరాని అనుబంధమే.
గాంధీజీ తన జీవితకాలంలో ఏకంగా 21 ఏళ్ల పాటు ఆఫ్రికా గడ్డపైనే గడిపారు. అక్కడి వర్ణ వివక్షపై ఆయన చేసిన పోరాటం ప్రపంచ చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయం. ఇప్పుడు ఆ దేశం ప్రపంచకప్నకు ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో.. బాపూజీకి ఘనమైన నివాళి అర్పించే ఉద్దేశంతోనే అక్టోబర్ 2వ తేదీన ఈ మెగా టోర్నీకి శ్రీకారం చుట్టాలని ఐసీసీ భావిస్తోంది.
క్రికెట్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ పోరు..
అక్టోబర్ 2న టోర్నీని ప్రారంభించినా, ముగింపు తేదీలో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదని తెలుస్తోంది. ఫైనల్ మ్యాచ్ ముందుగా అనుకున్నట్లుగానే నవంబర్ 21వ తేదీన జరుగుతుంది. దీని ప్రకారం ఈ ప్రపంచకప్ ఏకంగా 50 రోజుల పాటు సుదీర్ఘంగా సాగనుంది. క్రికెట్ చరిత్రలో ఒక వరల్డ్ కప్ ఇన్ని రోజుల పాటు జరగడం ఇదే తొలిసారి. గతంలో 2003లో జరిగిన వన్డే ప్రపంచకప్ 47 రోజుల పాటు జరగడమే ఇప్పటివరకు ఉన్న రికార్డు. ఇప్పుడు ఆ రికార్డును ఈ ఆఫ్రికా వరల్డ్ కప్ తిరగరాయనుంది.
ముచ్చటగా 12 మైదానాలు..
ఈ మెగా టోర్నీకి సంబంధించిన మ్యాచ్ల కోసం ఐసీసీ ఇప్పటికే వేదికలను ఖరారు చేసింది. మొత్తం 12 అద్భుతమైన మైదానాల్లో ఈ మ్యాచ్లు జరగనున్నాయి. సింహభాగం దక్షిణాఫ్రికాలోని 8 మైదానాలకు దక్కగా, జింబాబ్వేలోని 3 మైదానాలు, నమీబియాలోని కేవలం ఒక్క స్టేడియం మాత్రమే ఈ ప్రపంచకప్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.