
హార్ముజ్ జలసంధి రవాణా మార్గంపై ఒమన్-ఇరాన్ మధ్య ఒప్పందం కుదరడంపై అమెరికా అధ్యక్షుడు గరంగరం అయ్యారు. చాలా రోజులుగా ఒమన్ మధ్యవర్తిగా ఉండి.. అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందం చేసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఒమన్ ఒంటరిగా ఇరాన్ ఒప్పందం చేసుకోవడంపై ట్రంప్ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.
ఇరాన్తో కొనసాగుతున్న ఘర్షణ, హార్ముజ్ జలసంధి విషయంలో ఒమన్ అడ్డుగా వస్తే ఆ దేశంపై కూడా తీవ్రంగా దాడి చేస్తామని ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. సోమవారం ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. హార్ముజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలను నిర్వహించేందుకు గత కొన్ని వారాలుగా ఇరాన్ దౌత్యవేత్తలు ఒమన్ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్-ఒమన్ మధ్య జరుగుతున్న సమాంతర చర్చలపై ట్రంప్ను ప్రశ్నించగా.. ఆయన తీవ్రంగా స్పందించారు.
‘‘ఒమన్ అడ్డుగా వస్తే.. ఆ దేశంపై తీవ్రంగా దాడి చేస్తాం’’ అంటూ ట్రంప్ హెచ్చరించినట్లు ఫాక్స్ న్యూస్ పేర్కొంది. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ గడువు ముగియడానికి కొద్ది రోజుల ముందు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. హార్ముజ్ జలసంధి ప్రస్తుతం మధ్యప్రాచ్య ఘర్షణల్లో అత్యంత కీలకమైన ఉద్రిక్తత కేంద్రంగా మారింది. ప్రపంచ వాణిజ్యానికి, ముఖ్యంగా చమురు రవాణాకు ఈ జలమార్గం అత్యంత కీలకం కావడంతో ఇరాన్, అమెరికా మధ్య వివాదంలో హార్ముజ్ అంశం ప్రధానంగా మారింది.
ఇరాన్పై తన వైఖరిని కూడా ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. ఇరాన్ ‘‘తెల్ల జెండా ఎగరేసి లొంగిపోవాలి’’ అని వ్యాఖ్యానించినట్లు ఫాక్స్ న్యూస్ జర్నలిస్ట్ ట్రే యింగ్స్ట్ ఎక్స్లో వెల్లడించారు. ‘‘వాళ్లు మంచి పోకర్ ఆటగాళ్లు.. కానీ చనిపోతున్నారు’’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించినట్లు తెలిపారు. ఇరాన్పై అమెరికా సైనిక చర్యలకు సంబంధించి తనకు ఎలాంటి నిర్దిష్ట గడువు లేదని ట్రంప్ చెప్పారు. ‘‘నాకు ఎలాంటి టైమ్ షెడ్యూల్ లేదు. నేను తొందరపడటం లేదు. అమెరికా మధ్యంతర ఎన్నికలకు నా ఆలోచనలతో ఎలాంటి సంబంధం లేదు’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండకుండా చూడటమే అమెరికా ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ‘‘ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ, ఏ రూపంలోనూ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదనేదే ఎప్పటికీ మా ప్రధాన లక్ష్యం’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన 60 రోజుల కాల్పుల విరమణ గడువు ముగింపు దశకు చేరుకున్న సమయంలో ట్రంప్ తాజా హెచ్చరికలు చేశారు. హార్ముజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలు, ఇరాన్ అణు కార్యక్రమం, అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ వంటి అంశాలపై ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్-ఒమన్ మధ్య హార్ముజ్ జలసంధి నిర్వహణపై జరుగుతున్న చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయన్నది ఇప్పుడు కీలకంగా మారింది. మరోవైపు ట్రంప్ తాజా వ్యాఖ్యలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.