
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. బీజేపీ రాష్ట్ర కార్యాలయం కమలాలయంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో నాగేంద్రన్.. సీఎం విజయ్ గతంలో చేసిన ‘నాన్న ఎక్కడ?’ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కౌంటర్ ఇచ్చారు. ‘అసెంబ్లీలో నాన్న ఎక్కడ.. నాన్న ఎక్కడ అని వెతికితే ఎలా తెలుస్తుంది. ఇంటికి వెళ్లి అడిగితేనే తెలుస్తుంది’ అంటూ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు సీఎం విజయ్ తల్లిని ఉద్దేశించి అవమానకరంగా ఉన్నాయంటూ డీఎంకే, కాంగ్రెస్, టీవీకే నేతలు తీవ్రంగా మండిపడ్డారు. కుటుంబ సభ్యులను, ముఖ్యంగా తల్లిని రాజకీయ విమర్శల్లోకి తీసుకురావడం సరికాదంటూ మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సైతం నాగేంద్రన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. బీజేపీ నేత ఖుష్బూ కూడా ఆయన వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్కం ఠాగూర్.. నాగేంద్రన్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఈ వ్యవహారంపై టీవీకే కార్యకర్త, న్యాయవాది వర్తిని డీజీపీకి ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాదు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ఆడియోలు, పోస్టులను ఆధారాలుగా సమర్పించినట్లు సమాచారం. దీంతో తమిళనాడులో విజయ్ వర్సెస్ బీజేపీ మధ్య రాజకీయ మాటల యుద్ధం మరింత ముదిరింది.