
MLC Nagababu Gets Cabinet Rank: జనసేన ఎమ్మెల్సీ, సినీ నటుడు కొణిదెల నాగబాబుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక పదవి అప్పగించింది. ఆయనకు క్యాబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పర్యావరణ, అటవీశాఖకు సంబంధించిన గ్రీన్ నిర్వాహక కమిటీ చైర్మన్గా నాగబాబును ప్రభుత్వం నియమించింది. ఈ పదవికి కేబినెట్ ర్యాంక్ కల్పించడంతో.. రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. గతంలో నాగబాబుకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉందంటూ ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం ఆయనను కీలక కమిటీకి చైర్మన్గా నియమిస్తూ కేబినెట్ హోదా ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
నాగబాబు నియామకం నేపథ్యంలో శాసనమండలిలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నాగబాబును పలకరించి కుశల ప్రశ్నలు అడిగారు. ఇద్దరు నేతలు కొద్దిసేపు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు కుటుంబ సభ్యుల గురించి నాగబాబును అడిగి తెలుసుకున్నారు. ‘పిల్లలు బాగున్నారా?’ అంటూ త్రిమూర్తులు ప్రశ్నించగా.. నాగబాబు కూడా ఆయనతో స్నేహపూర్వకంగా మాట్లాడారు. అలాగే నాగబాబు ఆరోగ్యం గురించి కూడా తోట త్రిమూర్తులు అడిగారు. రాజకీయంగా వేర్వేరు పార్టీలకు చెందిన నేతలు శాసనమండలిలో ఆప్యాయంగా పలకరించుకోవడం అక్కడ ఆసక్తికరంగా మారింది.
