
వ్యవసాయ రంగంలో పంట దిగుబడి సాధించడంతో పాటు పండించిన ఉత్పత్తులను సురక్షితంగా నిల్వ ఉంచడం అతిపెద్ద సవాలు. ముఖ్యంగా తోటబడి పంటలైన పండ్లు, కూరగాయలు, పువ్వులు త్వరగా పాడైపోవడం వల్ల రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా సోలార్ కోల్డ్ రూమ్ సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. వీటి ఏర్పాటును ప్రోత్సహించడానికి ప్రభుత్వం వివిధ పథకాల కింద భారీ సబ్సిడీలను అందిస్తోంది.
సోలార్ కోల్డ్ రూమ్ ప్రయోజనాలు:
గ్రిడ్ విద్యుత్తో పనిలేకుండా కేవలం సౌరశక్తితోనే నిరంతరం పనిచేస్తాయి. కనుక, విద్యుత్ కొరత లేకుండా ఉంటుంది. కోత అనంతర నష్టాలను గణనీయంగా తగ్గించి, ఉత్పత్తుల నాణ్యతను కాపాడుతాయి. దీంతో మార్కెట్లో సరైన ధర వచ్చేంత వరకు ఉత్పత్తులను నిల్వ ఉంచుకుని విక్రయించే సదుపాయం కలుగుతుంది.
సబ్సిడీ పరిమితి, పథకాలు:
కేంద్ర ప్రభుత్వం మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, నేషనల్ హార్టికల్చర్ బోర్డ్, రాష్ట్రీయ క్రిషి వికాస్ యోజన ద్వారా వీటి నిర్మాలకు సబ్సిడీ ఇస్తోంది. మైదాన ప్రాంతాల్లోని రైతులకు లేదా రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు కోల్డ్ రూమ్ నిర్మాణ వ్యయంలో 35శాతం వరకు సబ్సిడీ అందుతుంది. కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల రైతులకు గరిష్టంగా 50శాతం వరకు సబ్సిడీ లభిస్తుంది.
ప్రాజెక్ట్ సామర్థ్యం ఉదాహరణకు 5 మెట్రిక్ టన్నుల నుండి 15 మెట్రిక్ టన్నులు ఆధారంగా సబ్సిడీ మొత్తాన్ని నిర్ణయిస్తారు. రైతులు, రైతు సమూహాలు, స్వయం సహాయక బృందాలు, వ్యవసాయ సంబందిత చిన్న పరిశ్రమలు ఈ సబ్సిడీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల రైతులు సమీపంలోని జిల్లా ఉద్యానవన శాఖ లేదా వ్యవసాయ అధికారులను సంప్రదించాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ లేదా MIDH అధికారిక పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు నమోదు చేసుకోవాలి.
దరఖాస్తు సమయంలో ఆధార్ కార్డ్, పట్టాదార్ పాస్ పుస్తకం, బ్యాంక్ ఖాతా వివరాలు, కోల్డ్ రూమ్ ప్రాజెక్ట్ నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. సోలార్ కోల్డ్ రూమ్లను వినియోగించుకోవడం ద్వారా రైతులు వ్యాపారులపై ఆధారపడటం తగ్గి, తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర పొందే వీలుంది.