
హైదరాబాద్ ఎర్రగడ్డలో నిర్మించిన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (డా.ఎంసీఆర్ టిమ్స్) సనత్నగర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి వచ్చింది. సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ ఆసుపత్రిని ప్రారంభించారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో నిర్మించిన ఈ ఆసుపత్రి నగరంలోని ప్రభుత్వ వైద్య రంగంలో కీలకంగా మారనుంది.
22.6 ఎకరాల్లో.. రూ.1,100 కోట్ల వ్యయం
టిమ్స్ సనత్నగర్ ఆసుపత్రిని మొత్తం 22.6 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఇందుకోసం సుమారు రూ.1,100 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. మొత్తం 1,000 పడకల సామర్థ్యంతో ఆసుపత్రిని అత్యాధునికంగా తీర్చిదిద్దారు. ఆసుపత్రిలో ఐదు ప్రధాన బ్లాకుల్లో అవసరమైన వైద్య, పరిపాలనా, రోగుల సేవలకు సంబంధించిన సదుపాయాలను సిద్ధం చేశారు. సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించేందుకు అవసరమైన మౌలిక వసతులను అందుబాటులోకి తీసుకొచ్చారు.
లైవ్ చూడండి
ట్రయల్ రన్తో సేవలకు శ్రీకారం
ఆసుపత్రి పూర్తి స్థాయిలో ప్రారంభానికి ముందు ట్రయల్ రన్ నిర్వహించారు. డే కేర్ విభాగాలను కూడా ప్రయోగాత్మకంగా ప్రారంభించి రోగులకు సేవలు అందించారు. ఈ దశలో రోజుకు సుమారు 250 మంది రోగులకు వైద్య సేవలు అందించినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆసుపత్రిలోని వైద్య విభాగాలు, సిబ్బంది, పరికరాలు, రోగుల సేవల ప్రక్రియలను పరిశీలించే అవకాశం లభించింది. పూర్తి స్థాయిలో సేవలు ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.
కీలక బాధ్యతల్లో అనుభవజ్ఞులైన అధికారులు
టిమ్స్ సనత్నగర్ నిర్వహణ కోసం ప్రభుత్వం కీలక నియామకాలు చేసింది. మాజీ డీఎంఈ డా. ఎ. నరేంద్రకుమార్ను ఇన్ఛార్జి డైరెక్టర్గా నియమించింది. మాజీ ఏడీఎంఈ డా. మహబూబ్ ఖాన్ను ఇన్ఛార్జి సూపరింటెండెంట్గా బాధ్యతలు అప్పగించింది. వీరి పర్యవేక్షణలో ఆసుపత్రి వైద్య సేవలు, పరిపాలన, సిబ్బంది సమన్వయం వంటి అంశాలు కొనసాగనున్నాయి.
గాంధీ, ఉస్మానియా, నిమ్స్ నుంచి సిబ్బంది
టిమ్స్ సనత్నగర్లో వైద్య సేవల కోసం ఇప్పటికే సిబ్బందిని సిద్ధం చేశారు. గాంధీ ఆసుపత్రి, ఉస్మానియా జనరల్ ఆసుపత్రి, నిమ్స్ నుంచి కొంతమంది సిబ్బందిని తీసుకున్నారు. వీరితో పాటు ఇటీవల కొత్తగా సుమారు 200 మంది వైద్య సిబ్బందిని రిక్రూట్ చేశారు. వైద్యులు, నర్సింగ్, ఇతర ఆరోగ్య సేవల సిబ్బంది అందుబాటులో ఉండటంతో ఆసుపత్రిని దశలవారీగా పూర్తి సామర్థ్యంతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.