
ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి బాటలు వేస్తూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ములుగు జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ తరఫున హ్యామ్ రోడ్ల నిర్మాణానికి సూచికగా ఏర్పాటు చేసిన పైలాన్ను ఆవిష్కరించడంతో పాటు నూతన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని సీఎం ప్రారంభించారు.
వనదేవతల ఆశీస్సులు.. మేడారం క్షేత్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వంలో మేడారంలోని సమ్మక్క-సారలమ్మ ఆలయాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రామప్ప, వేయి స్తంభాల ఆలయాల ఆధ్యాత్మిక శోభతో పోటీపడేలా మేడారం పుణ్యక్షేత్రాన్ని సమగ్రంగా తీర్చిదిద్దామని, రాబోయే రోజుల్లో జంపన్న వాగును కూడా మోడల్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గత పాలకులు వనదేవతల క్షేత్రాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు.
బతుకమ్మ చీరల కమీషన్లపై విమర్శలు.. ఆడబిడ్డలకు చిలకపచ్చ చీరల కానుక
గత ప్రభుత్వ హయాంలో నిరుపేద ఆడబిడ్డలకు పంపిణీ చేసే బతుకమ్మ చీరల కొనుగోళ్లలో కూడా కమీషన్లు పిండుకున్నారని ముఖ్యమంత్రి తీవ్రంగా ధ్వజమెత్తారు. తమ పాలనలో మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ రాబోయే డిసెంబర్లో పండుగ కానుకగా ఆడబిడ్డలందరికీ నాణ్యమైన చిలకపచ్చ చీరలను అందజేస్తామని ప్రకటించారు.
తమిళనాడులో క్షుద్రపూజల సంస్కృతిపై నిప్పులు
ప్రతిపక్ష ముఖ్య నేతలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందనే స్వార్థంతో సొంత చెల్లెలినే ఇంట్లో నుంచి గెంటేసిన సంస్కృతి వారిదని మండిపడ్డారు. కనీసం సొంత బిడ్డను ఇల్లు వెళ్లగొడుతుంటే అడ్డు చెప్పకుండా తండ్రి సైలెంట్గా ఉండిపోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో పాడిపంటలు ఎండిపోయి, తీవ్ర కరువు రావాలని కోరుకుంటూ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లి కొందరు అఘోరాలు, క్షుద్రపూజలు చేయిస్తున్నారని తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.