
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరోసారి చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. పట్టపగలే ఒంటరి మహిళను టార్గెట్ చేసి క్షణాల వ్యవధిలో బంగారు గొలుసును అపహరించుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మేడ్చల్ పరిధిలోని గిర్మాపూర్ గ్రామానికి చెందిన 58 ఏళ్ల జక్కుల సుజాత అనే మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అదే సమయంలో పల్సర్ బైక్పై హెల్మెట్లు ధరించి వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను గమనించారు.
ఎవరూ లేని అదును చూసి ఒక్కసారిగా ఆమె దగ్గరకు దూసుకొచ్చిన దుండగులు.. సుజాత మెడలోని బంగారు గొలుసును బలంగా లాక్కొని క్షణాల వ్యవధిలో అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో భయభ్రాంతులకు గురైన బాధితురాలు వెంటనే తేరుకుని డయల్ 100కు కాల్ చేసి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలోని సీసీ కెమెరాలలో నిందితుల కదలికలు రికార్డ్ కావడంతో పోలీసులు ఆ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. దుండగులు వాడినట్లు భావిస్తున్న పల్సర్ బైక్ నంబర్, వారి ఆచూకీ కోసం పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.