Reading Time: < 1 minute
కరీంనగర్ యువతి సత్తా.. ఏకంగా ఇంటెలిజెన్స్ బ్యూరోలో కొలువు!

కరీంనగర్, ఆగస్ట్‌ 17: చదువుపై ఉన్న ఆసక్తి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, పట్టుదలతో కృషి చేస్తే ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని నిరూపించారు కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన వడ్లకొండ సింధూజ. జమ్మికుంట గణేష్‌నగర్‌కు చెందిన వడ్లకొండ శ్రీనివాస్‌–వనజ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె శృతికి వివాహం కాగా, చిన్న కుమార్తె సింధూజకు చిన్ననాటి నుంచే చదువుపై ఆసక్తి ఉండేది. ఆమె అభిరుచిని గమనించిన తండ్రి శ్రీనివాస్ ఉన్నత చదువులు అభ్యసించేందుకు ప్రోత్సహించారు.

సింధూజ జమ్మికుంటలో ప్రాథమిక విద్య, హనుమకొండలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. అనంతరం హైదరాబాద్‌లో డిగ్రీ అభ్యసించి, సివిల్స్‌ కోచింగ్ తీసుకున్నారు. పట్టుదలతో పరీక్షలకు సిద్ధమై కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)లో ‘సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ పోస్టుకు’ ఎంపికయ్యారు. పరీక్షతో పాటు ఇంటర్వ్యూలోనూ ప్రతిభ కనబరిచి ఉద్యోగాన్ని సాధించారు.

సింధూజ విజయంపై కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఐఏఎస్‌ పరీక్ష రాసి దేశానికి సేవ చేయాలన్నదే తన లక్ష్యమని సింధూజ తెలిపారు. చదువుపై తల్లిదండ్రుల ప్రోత్సాహం, లక్ష్యంపై పట్టుదలతో కృషి చేస్తే విజయాన్ని సాధించవచ్చని సింధూజ విజయం యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది.