Reading Time: < 1 minute
Ap Assembly Panel Speakers Appointed By Speaker Ayyanna Patrudu

AP Assembly Panel Speakers: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్యానల్ స్పీకర్లను స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. శాసనసభ కార్యకలాపాలను సజావుగా నిర్వహించడంలో భాగంగా ఆరుగురు సభ్యులను ప్యానల్ స్పీకర్లుగా నియమించారు. ప్యానల్ స్పీకర్లుగా మండలి బుద్ధ ప్రసాద్, కోళ్ల లలిత కుమారి, జ్యోతుల నెహ్రూ, విష్ణుకుమార్ రాజు, వరద రాజుల రెడ్డి, దాసరి సుధలను నియమించినట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. శాసనసభ సమావేశాల సమయంలో స్పీకర్ అందుబాటులో లేని సందర్భాల్లో సభా కార్యక్రమాలను నిర్వహించడంలో ప్యానల్ స్పీకర్లు కీలక పాత్ర పోషిస్తారు. తాజాగా ప్రకటించిన ఈ నియామకాలతో సభా వ్యవహారాలు మరింత సజావుగా కొనసాగేందుకు అవకాశం ఉంటుంది.

మరోవైపు.. డీఎస్సీ (DSC)తో పాటు ఇతర అంశాలపై వైసీపీ అధినేత జగన్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు బయట, రోడ్లపై మాట్లాడటం కాకుండా ఏమైనా అనుమానాలు, సందేహాలు ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించాలని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు సూచించారు. సభలోనే ప్రభుత్వం సమాధానం ఇస్తుందని స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన అయ్యన్నపాత్రుడు.. ఎక్కడో రోడ్లపై మాట్లాడిన అంశాలకు సమాధానం చెప్పాలంటే ఎలా అని ప్రశ్నించారు. జగన్ ఎమ్మెల్యేగా, ఆయన పార్టీకి చెందిన సభ్యులు శాసనసభకు వచ్చి తమ సమస్యలు, అనుమానాలను సభలో ప్రస్తావించాలని సూచించారు. జగన్‌కు ప్రస్తుతం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా తాను ఎలా ఇవ్వగలనని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత హోదా అంశంపై గతంలోనూ తన వైఖరిని స్పష్టం చేసినట్లు తెలిపారు.

వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని అయ్యన్నపాత్రుడు సూచించారు. సభలో సంబంధిత మంత్రులు అందుబాటులో ఉంటారని, ఎమ్మెల్యేలు అడిగే ప్రశ్నలకు మంత్రులతో సమాధానాలు ఇప్పించే బాధ్యతను స్పీకర్‌గా తాను తీసుకుంటానని స్పష్టం చేశారు. డీఎస్సీ నియామకాలు, ఇతర ప్రభుత్వ అంశాలపై వైసీపీకి ఏవైనా సందేహాలు ఉంటే వాటిని అసెంబ్లీ వేదికగా లేవనెత్తితే ప్రభుత్వం సమాధానం చెప్పే అవకాశం ఉంటుందని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై చర్చకు శాసనసభే సరైన వేదిక అని స్పష్టం చేశారు శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు..