
మీరు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో షాపింగ్ మాల్స్లో షాపింగ్ చేస్తుంటే వస్తువుల ధరలు రూ.99, రూ.499గా ఉండటం మీరు చూసే ఉంటారు. అయితే చివరిలో 9 వచ్చేలా ధరలను ఎందుకు పెడతారు? అనే అనుమానం చాలామందికి వచ్చి ఉంటుంది. అయితే దీని వెనుక ఒక సైకాలజీ దాగి ఉందట. ఈ సాంప్రదాయం అనేది ఎప్పటినుంచో కొనసాగుతూ వస్తోంది. దీనిని మార్కెటింగ్ చార్మ్ ప్రైసింగ్గా చెబుతారు. ఈ విధానంలో ధరలో ఒక్క రూపాయి తేడా ఉన్నా.. తక్కువ ధరకు వస్తువులు ఉన్నాయనే భావన కస్టమర్లకు కలుగుతుంది. దీని వల్ల ధరలను చూసే విధానంలో మార్పు ఉంటుంది. ప్రొడక్ట్ తక్కువ ధరకే లభిస్తుందనే భావన ఏర్పడుతుంది.
ఒక్క రూపాయి తేడా అయినా..
రూ.500, రూ.499 మధ్య ఒక్క రూపాయి మాత్రమే తక్కువ. కానీ ప్రొడక్ట్ ఒక్క రూపాయికి తక్కువకే లభిస్తుందని కస్టమర్ల మైండ్లో పడుతుంది. మానవుల మెదడు ఈ రెంటింటిని ఒకేలా చూడదు. ఒక్క రూపాయి తేడా అయినా రూ.499 చూడగానే తక్కువకు లభిస్తుందనే భావన కలుగుతుంది. దీంతో ధరల్లో చివరిలో 9 అనే అంకెతో ముగించడం వల్ల ప్రొడక్ట్ మరింత చౌకగా ఉందనే అభిప్రాయానికి వస్తారు. ఇక 9తో ముగించడానికి మరో కారణం కూడా ఉంది. అదే లెఫ్ట్ డిజిట్ ఎఫెక్ట్గా చెబుతున్నారు. మనం ధరలను చూసేటప్పుడు మొదటి అంకెపై ఎక్కువ దృష్టి పెడతాము. రూ.499ని చూసినప్పుడు మొదట 4ను మన మెదడు గుర్తిస్తుంది. రూ.500గా ఉన్నప్పుడు 5ను తొలుత గుర్తిస్తుంది. దీని వల్ల రూ.500 కంటే రూ.499 తక్కువగా ఉన్నట్లు మైండ్లో పడుతుంది. ఈ సైకాలజీని ఉపయోగించుకుని తమ వ్యాపారాన్ని కంపెనీలు పెంచుకుంటున్నాయి.
ఈ మాయలో పడొద్దు
ఈ పద్దతి ఇప్పుడు మొదలైనది కాదు.. 1900 సంవత్సరం నుంచే ఈ ట్రిక్ మొదలైంది. రూ.500తో కాకుండా రూ.499గా ఉన్న వస్తువులు ఎక్కువగా అమ్ముడైనట్లు పలు పరిశోధనల్లో కూడా తేలింది. వస్తువులకు కొనుగోలు చేయడంలో దీని ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దీంతో వ్యాపారులు దీనిని తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. సైకాలిజికల్ ప్రైసింగ్ వ్యూహంగా మార్కెటింగ్ రంగంలో దీనిని చెబుతున్నారు. దీంతో మీరు షాపింగ్ చేసేటప్పుడు 9 అంకెల పట్ల అట్రాక్ట్ కాగండి. ప్రొడక్ట్ నాణ్యత,ధరను అంచనా వేసుకోండి. ఇతర చోట్ల ధరలతో పోల్చి తీసుకోండి. దీని వల్ల మీరు ఈ మోజులో పడకుండా ఉంటారు.