
అనారోగ్యం కారణంగా సెలవు తీసుకుంటే.. ఉద్యోగం నుంచి ఎలా తొలగిస్తారంటూ టెక్ మహీంద్ర ఐటీ కంపెనీపై న్యాయ పోరాటం చేస్తున్న మాజీ ఉద్యోగిని భావన.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 2026, ఆగస్ట్ 17వ తేదీ ఇందిరా పార్క్ దగ్గర టెంట్ వేసుకుని ఆమరణ దీక్షకు దిగారు. అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారని టెక్ మహీంద్రపై ఆగ్రహం వ్యక్తం చేశారామె.
తన అనారోగ్యంతో పాటు కుమార్తె అనారోగ్యం కారణంగా సెలవు తీసుకున్నానని.. ఆ మాత్రానికి టెక్ మహీంద్ర ఉద్యోగం నుంచి తొలగించిందని ఆరోపించారు భావన. తొలగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని.. తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారామె. ఉద్యోగుల సెలవు హక్కులను గౌరవించాలని.. ఈ ఘటనపై విచారణ చేసి న్యాయం చేయాలని కోరారామె.
ALSO READ : 9 ఏళ్లలో రూ.2 లక్షల ప్యాకేజీ నుంచి రూ.75 లక్షలకు శాలరీ వరకు..
సంస్థలో ఉద్యోగులపై ఒత్తిడి, వేధింపులకు సంబంధించిన ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టి.. ఉద్యోగుల ఆరోగ్యం, భద్రత, గౌరవానికి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు భావన. టెక్ మహీంద్రాతో పాటు ఇతర సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించిన లేబర్ కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులను 45 రోజుల్లో విచారణ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ.. అందుకు సంబంధించిన బ్యానర్లను ప్రదర్శించారు ఇందిరా పార్క్ దగ్గర దీక్ష శిబిరంలో. తనకు జరిగిన నష్టానికి న్యాయం చేయడంతో పాటు అన్ని డిమాండ్లను పరిష్కరించే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తానని.. తన కోసమే కాకుండా తనలాంటి ఎంతో మంది బాధితులకు న్యాయం కోసం పోరాటం చేస్తున్నట్లు వెల్లడించారామె.