Reading Time: < 1 minute
Kulgam Terror Attack Non Local Labourer Killed Worker Injured

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఇద్దరు వలస కార్మికులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక కార్మికుడు మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కుల్గాం జిల్లాలోని కెల్లం ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఈ దాడి జరిగింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కెల్లం ప్రాంతంలో పనిచేస్తున్న ఇద్దరు స్థానికేతర కార్మికులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఇద్దరూ తీవ్రంగా గాయపడటంతో.. భద్రతా సిబ్బంది, స్థానిక అధికారులు వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

అయితే చికిత్స పొందుతూ ఒక కార్మికుడు గాయాల తీవ్రతతో మృతి చెందాడు. మరో కార్మికుడి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంత్‌నాగ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి చికిత్స కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఉగ్రదాడి జరిగిన వెంటనే భద్రతా బలగాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. కెల్లం ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని.. అన్ని మార్గాలను దిగ్బంధించాయి. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను గుర్తించి పట్టుకునేందుకు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి.

కుల్గాం జిల్లాలో స్థానికేతర కార్మికులను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ తాజా దాడితో భద్రతా వ్యవస్థ అప్రమత్తమైంది. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. దాడికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.