
హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఒక నెల జైలు శిక్ష విధించారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆయన తీవ్రంగా స్పందించారు. తనపై వస్తున్న ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమని, వాటిలో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.
వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొన్ని వర్గాలు కావాలనే తనపై సోషల్ మీడియా వేదికగా ఫేక్ ప్రచారం చేస్తున్నాయని రంగనాథ్ మండిపడ్డారు. ప్రజలు, సోషల్ మీడియా వినియోగదారులు ఎవరూ కూడా ఇటువంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. హైడ్రా తన విధులను పారదర్శకంగా నిర్వహిస్తోందని, నిబంధనల ప్రకారమే ముందుకు వెళ్తున్నామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
మరో వైపు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ను వెంటనే ఆ పదవి నుంచి తప్పించాలని జులై 31న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. ఆయన స్థానంలో తగిన ప్రత్యామ్నాయ అధికారిని నియమించాలని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా టాటా మోహన్రావు కేసులో సుప్రీం కోర్టు అఫ్ ఇండియా ఇచ్చిన తీర్పును ప్రస్తావించింది హైకోర్టు. శిక్షించడంలో కాకుండా క్షమించడంలోనే చట్టం యొక్క ఔన్నత్యం ఉందని వ్యాఖ్యానించింది.
కోర్టు ఆదేశాలను గతంలో ఇచ్చిన అండర్టేకింగ్ ను కమిషనర్ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లు హైకోర్టు స్పష్టం చేసింది. శాంతాశ్రీరామ్ కన్స్ట్రక్షన్ కంపెనీ కేసులో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ప్రైవేట్ భూమిలోకి ప్రవేశించి, యంత్రాలతో కూల్చివేతలు చేపట్టడం చట్టవిరుద్ధమని తేల్చిచెప్పింది.