
నాగర్కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. పెంట్లవెల్లి కేంద్రంలో ఓ ఆర్ఎంపీ డాక్టర్ను దుండగులు అత్యంత కిరాతకంగా హతమార్చారు. పెంట్లవెల్లికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ మల్లయ్య ఎప్పట్లాగే తన క్లినిక్లో రోగులకు వైద్యం అందిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో కొందరు గుర్తుతెలియని దుండగులు ఒక్కసారిగా క్లినిక్లోకి చొరబడ్డారు.
అప్రమత్తమయ్యేలోపే డాక్టర్ మల్లయ్య కళ్లలో కారం చల్లిన దుండగులు.. ఆయన్ను బయటికి లాక్కొచ్చి విచక్షణారహితంగా కత్తులతో నరికారు. ఈ దాడిలో తీవ్ర రక్తస్రావం కావడంతో మల్లయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ హత్యకు పాతకక్షలే కారణమై ఉండవచ్చని, లేదా భూ వివాదాల నేపథ్యంలోనే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.