Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!

Ellyse Perry Emotional Reaction Goes Viral: మహిళల టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో ఇంగ్లండ్ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన ఆస్ట్రేలియా రికార్డు స్థాయిలో ఏడోసారి టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ విజయంపై ఆసీస్ స్టార్ ఆల్రౌండర్ ఎల్లీస్ పెర్రీ ఆనందం వ్యక్తం చేసింది. చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ప్రపంచకప్ గెలవడం తన కెరీర్లో ఎప్పటికీ మరచిపోలేని క్షణమని పేర్కొంది. ఇంగ్లండ్ లాంటి బలమైన జట్టును లార్డ్స్లో అదీనూ ఫైనల్లో ఓడించి ట్రోఫీని అందుకోవడం ఎంతో ప్రత్యేకమని, అదే సమయంలో చాలా సంతోషంగా ఉందని తెలిపింది. కెప్టెన్ సోఫీ మోలినెక్స్ నాయకత్వంలో జట్టు మొత్తం టోర్నమెంట్ అంతా అద్భుతమైన క్రికెట్ ఆడిందని ఆస్ట్రేలియా అందం పెర్రీ ప్రశంసించింది.
చాలా ప్రత్యేకమైన రోజు:
మ్యాచ్ అనంతరం ఎల్లీస్ పెర్రీ మాట్లాడుతూ.. ‘ఈ రోజు నిజంగా చాలా ప్రత్యేకమైన రోజు. లార్డ్స్లోని వాతావరణం, ఫైనల్ సందర్భంగా అభిమానులు సృష్టించిన ఉత్సాహం అద్భుతంగా అనిపించింది. ఈ మైదానంలో ఆడే ప్రతి అవకాశం నాకు ఎంతో విలువైనది. అలాంటి వేదికపై ప్రపంచకప్ గెలవడం మరింత ఆనందాన్ని ఇచ్చింది. టోర్నమెంట్ మొత్తం అద్భుతంగా ఆడిన ఇంగ్లండ్ జట్టుపై మాకు ఎంతో గౌరవం ఉంది. అలాంటి ప్రత్యర్థిని ఓడించి టైటిల్ గెలవడం మా జట్టుకు గొప్ప సంతృప్తిని ఇచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది’ అని చెప్పింది.
జీవితాంతం గుర్తుండిపోతుంది:
కెప్టెన్ సోఫీ మోలినెక్స్పై కూడా పెర్రీ ప్రశంసలు కురిపించింది. ‘ఇది సోఫీకి కెప్టెన్గా తొలి ప్రపంచకప్. ఆమె నాయకత్వంలో మేము అద్భుతమైన క్రికెట్ ఆడాం. ప్రతి మ్యాచ్లో జట్టు ఎంతో క్రమశిక్షణతో, ఆత్మవిశ్వాసంతో ఆడింది. ఈ విజయ ప్రయాణంలో భాగం కావడం నాకు ఎంతో గర్వంగా ఉంది. ఇలాంటి విజయాన్ని కలిసి ఆస్వాదించడం జీవితాంతం గుర్తుండిపోతుంది’ అని పేర్కొంది. ఎన్నో ఏళ్లుగా అత్యున్నత స్థాయిలో ఆడుతున్నప్పటికీ తనకు ఇంకా ప్రేరణ ఏమిటన్న ప్రశ్నకు పెర్రీ ఆసక్తికరంగా స్పందించింది. ‘మా జట్టులోని ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు మెరుగుపడాలని కోరుకుంటారు. గత కొన్నేళ్లలో మేము ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. వాటిని అధిగమిస్తూ మా ఆటను మరో స్థాయికి తీసుకెళ్లాం. అంతకంటే ముఖ్యంగా మా ఆటను చూసి అభిమానులు ఆనందించడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అలాంటి జట్టులో భాగం కావడం నా జీవితంలో గొప్ప అదృష్టం’ అని తెలిపింది.
ప్రతి అభిమానికి హృదయపూర్వక ధన్యవాదాలు:
క్రికెట్లోకి రావాలని కలలు కనే చిన్నారులకు కూడా పెర్రీ ప్రత్యేక సందేశం ఇచ్చింది. ‘కేవలం అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా మహిళల క్రికెట్ను ఆస్వాదిస్తూ స్టేడియానికి రావడం గత కొన్నేళ్లలో వచ్చిన గొప్ప మార్పు. భవిష్యత్తులో మహిళలు కూడా ఇలాంటి పెద్ద వేదికలపై ఆడటం పూర్తిగా సహజమైన విషయంగా ఈ తరం భావిస్తుంది. అదే మహిళల క్రికెట్ సాధించిన అతిపెద్ద విజయం. ఈ రోజు స్టేడియానికి వచ్చిన ప్రతి చిన్నారి ఈ మ్యాచ్ను ఆస్వాదించి ఉంటారని ఆశిస్తున్నాను’ అని చెప్పింది. అభిమానులకు, తల్లిదండ్రులకు కూడా పెర్రీ కృతజ్ఞతలు తెలిపింది. ‘పిల్లలను స్టేడియానికి తీసుకొచ్చిన తల్లిదండ్రులకు, మహిళల క్రికెట్కు అండగా నిలుస్తున్న ప్రతి అభిమానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ మద్దతు వల్లే ఈ రోజు మరింత ప్రత్యేకంగా మారింది. మీరు చూపిస్తున్న ప్రేమ, ప్రోత్సాహమే మాకు ముందుకు సాగే శక్తిని ఇస్తోంది’ అని భావోద్వేగంగా చెప్పింది.