Ambati Rambabu: పోలీసులను రాజకీయ కక్షకు వాడుతున్నారు.. అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు

Ambati Rambabu: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని రాజకీయ కక్ష సాధింపుకు ఉపయోగిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. వైసీపీ నేతలతో పాటు సోషల్ మీడియా యాక్టివిస్టులు, రాజకీయ విశ్లేషకులను లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదు చేస్తూ అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ, కేవీఆర్ అరెస్టు విషయంలో చట్టపరమైన విధానాలను పాటించలేదని అన్నారు. ఈ వ్యవహారంలో తెలంగాణ పోలీసులు కూడా ఏపీ పోలీసులపై కేసు నమోదు చేశారని గుర్తుచేశారు. కేవీఆర్, ప్రశ్న రావణ్లకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
తప్పు మాట్లాడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంలో అభ్యంతరం లేదని, అయితే వారు మాట్లాడిన అంశాలకు మించి తీవ్రమైన కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు అంబటి.. ప్రశ్న రావణ్ కేసులో పిఠాపురం కోర్టు ఆయనకు ఉపశమనం కల్పించిందని, పలుమార్లు కోర్టులు అనుకూలంగా తీర్పులు ఇచ్చినా ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవడం లేదని విమర్శించారు. ప్రశ్న రావణ్ను చంపే ప్రయత్నం జరిగిందని అంబటి రాంబాబు ఆరోపించారు. రావణ్ తమ పార్టీకి చెందిన వ్యక్తి కాదని, ఆయన ఒక యూట్యూబర్ మాత్రమేనని పేర్కొన్నారు. అయినప్పటికీ ఆయనపై తప్పుడు కేసులు నమోదు చేసి, యూఏపీఏ వంటి కఠిన చట్టాలను ప్రయోగించడం దుర్వినియోగమని విమర్శించారు.
రావణ్కు వైసీపీ తరఫున న్యాయ సహాయం అందిస్తామని అంబటి రాంబాబు తెలిపారు. రాష్ట్రంలో సోషల్ మీడియాపై చట్టవిరుద్ధంగా దౌర్జన్యకాండ కొనసాగుతోందని ఆరోపిస్తూ, ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఖండించారు. మరోవైపు, ఇతర సోషల్ మీడియా వ్యక్తులు అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నప్పటికీ వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు..