Reading Time: 2 minutes
Mod Cm Vijay Meeting Delhi Mekedatu Dam Tamil Nadu State Anthem Request

ప్రధాని మోడీతో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భేటీ అయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి ప్రధానితో సమావేశమయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు మోడీతో విజయ్ కీలక చర్చల జరిపారు. ఈ సందర్భంగా రెండు కీలక వినతలు సమర్పించారు. అలాగే తమిళనాడుకు సంబంధించిన పలు కీలక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

Cmvijay1

ఇటీవల నెదర్లాండ్స్ నుంచి ప్రాచీన చోళుల కాలానికి చెందిన రాగి ఫలకాలను తిరిగి భారత్‌కు తీసుకురావడంపై ప్రధాని మోడీకి విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించిన మేకేదాటు ఆనకట్ట ప్రాజెక్టుపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. మేకేదాటు ప్రాజెక్టు వల్ల తమిళనాడుకు కావేరీ జలాల లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉందని విజయ్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కావేరీ జల వివాదం ట్రైబ్యునల్, సుప్రీంకోర్టు తీర్పుల ఆత్మకు విరుద్ధమని తెలిపారు. కేంద్ర అనుమతి అవసరమైన ఈ ప్రాజెక్టుకు ఆమోదం ఇవ్వవద్దని జల్ శక్తి మంత్రిత్వ శాఖకు సూచనలు చేయాలని ప్రధాని మోడీని కోరారు.

ఇటీవల కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ మేకేదాటు ప్రాజెక్టుకు సంబంధించిన సవరించిన DPR‌ను త్వరలో కేంద్రానికి సమర్పిస్తామని ప్రకటించారు. తమిళనాడుకు ఈ ప్రాజెక్టును వ్యతిరేకించే హక్కు లేదని వ్యాఖ్యానించడంతొ రెండు రాష్ట్రాల మధ్య మరోసారి ఉద్రిక్తతలకు దారితీసింది.

అదే విధంగా ప్రభుత్వ కార్యక్రమాల ప్రారంభంలో తమిళనాడు రాష్ట్ర గీతం ‘తమిళ్ థాయ్’కు అనుమతి ఇవ్వాలని మరో కీలక విజ్ఞప్తి చేశారు. జాతీయ గీతం, జాతీయ గానం కలిసి ఉన్న సందర్భాల్లో ముందుగా పూర్తి స్థాయిలో ‘వందే మాతరం’ ఆలపించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జనవరిలో జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. అలాగే తమిళనాడులో DRDOకి చెందిన ‘సెంటర్ ఫర్ ఎయిర్‌బోర్న్ సిస్టమ్స్’ను కూడా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ ఘనవిజయం సాధించింది. 108 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. అనంతరం చిన్న పార్టీల మద్దతుతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం విశ్వాస పరీక్షలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ సభ్యుల మద్దతుతో విజయం సాధించారు.