Reading Time: 2 minutes
Pm Modi Secunderabad Visit Parade Grounds Security Traffic Rules

PM Modi Hyderabad Tour: ప్రధాని నరేంద్ర మోడీ రేపు సికింద్రాబాద్ వేదికగా భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సభకు సుమారు లక్ష మంది వరకు జనం వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు పరేడ్ గ్రౌండ్స్‌లో కనీవినీ ఎరుగని రీతిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మల్కాజిగిరి సీపీ బి.సుమతి పర్యవేక్షణలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.

అధునాతన నిఘా.. ప్రత్యేక బలగాలు
ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతా బలగాలు నగరాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. సుమారు 2,000 మందికి పైగా పోలీసులతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. NSG (నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్), OCTOPUS, ప్రత్యేక బలగాలు నిరంతరం పరేడ్ గ్రౌండ్స్ పరిసరాలను పర్యవేక్షిస్తున్నాయి. పరేడ్ గ్రౌండ్స్, సభకు వచ్చే రూట్లు, పార్కింగ్ ప్రాంతాలను వందలాది సీసీ కెమెరాల పరిధిలోకి తెచ్చారు. జాయింట్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా రియల్ టైమ్ మానిటరింగ్ జరుగుతోంది. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్ టీమ్స్‌తో యాంటీ సబోటేజ్ తనిఖీలు ముమ్మరం చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా సభకు వచ్చే వారు కొన్ని వస్తువులను తీసుకురాకూడదని పోలీసులు స్పష్టం చేశారు. ల్యాప్‌టాప్‌లు, డ్రోన్లు, కెమెరాలు, బ్యాగులు, వాటర్ బాటిల్స్, హెల్మెట్లు, లైటర్లు, మ్యాచ్ బాక్స్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లకు సభలోకి అనుమతి లేదు.

మహిళా సందర్శకుల భద్రతను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ‘షీ టీమ్స్’ను మోహరించారు. అధికారిక పాస్‌లు ఉన్న వారికి మాత్రమే లోపలికి అనుమతి ఉంటుందని, పాస్‌లు దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. సభ జరిగే సమయంలో ప్రధాన రహదారులపై వాహనాల పార్కింగ్‌ను పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. పోలీసులు కేటాయించిన నిర్దేశిత పార్కింగ్ ప్రదేశాల్లోనే వాహనదారులు తమ వాహనాలను నిలపాల్సి ఉంటుందని సూచించారు. పరేడ్ గ్రౌండ్స్ లోపల హాకర్లు, వెండర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని స్పష్టం చేశారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి అంబులెన్స్‌లు, ఫైర్ టెండర్లను సిద్ధంగా ఉంచారు. మోడీ సభ నేపథ్యంలో ప్రస్తుతం నగరం మొత్తం హై అలర్ట్‌లో ఉంది.

ఈ సందర్భంగా ప్రధాని సభ భద్రతా ఏర్పాట్లపై మల్కాజిగిరి CP సుమతి మాట్లాడుతూ.. ఈ సభ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించడానికి మొత్తం 2 వేల మంది లా అండ్ ఆర్డర్, 6 వేల మంది ట్రాఫిక్ పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముగ్గురు డీసీపీలు, ఐదుగురు అడిషనల్ డీసీపీలు, 21 మంది ఏసీపీలు, 61 మంది పీఎస్‌ఎస్పీఎస్‌లు (PSSPs), 57 మంది ఇన్స్పెక్టర్లు, 226 మంది ఎస్సై లు బందోబస్తు‌లో పాల్గొంటారని వెల్లడించారు. 12 బెటాలియన్ ప్లాటూన్స్, 6 AR ప్లాటూన్స్, ఆక్టోపస్ టీమ్స్, csw, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్, స్నిఫర్ డాగ్ టీమ్స్ కూడా బందోబస్తులో పాల్గొంటాయని చెప్పారు.

నల్గొండ, ఖమ్మం, వరంగల్, భువనగిరి జిల్లాల నుంచి వచ్చే కార్యకర్తల బస్సులకు ఉప్పల్ స్టేడియం వద్ద పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అక్కడి నుంచి ఆయా బస్సుల్లో వచ్చిన వాళ్లు మెట్రో ట్రైన్స్‌లో రావాలని చెప్పారు. మమహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల నుంచి వచ్చే కార్యకర్తల బస్సులకు నిజాం కాలేజ్, సంజీవయ్య పార్క్ వద్ద పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఈ సభకు మొత్తం 3200 బస్సులు వస్తాయని అంచనా వేస్తున్నామని, కార్యకర్తలు, వాహనదారులు పోలీసులకు సహకరించాలన్నారు. ఎమర్జెన్సీ కోసం గ్రీన్ ఛానల్ కూడా ఏర్పాటు చేశామని, ఎప్పటి పరిస్థితుల్లో డ్రోన్స్‌కి అనుమతి లేదని వెల్లడించారు. మీడియా డ్రోన్స్‌కి కూడా అనుమతి లేదని, నో ఫ్లై జోన్‌గా పెట్టామన్నారు.