Reading Time: 2 minutes
Sanju Samson : కోహ్లీని దాటేశాడు.. వార్నర్ ను వెనక్కి నెట్టాడు.. ఐపీఎల్ 2026లో సంజూ శాంసన్ విశ్వరూపం

Sanju Samson : ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) బ్యాటర్ సంజూ శాంసన్ ఆగుడు అస్సలు తగ్గడం లేదు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించగా.. ఈ గెలుపులో సంజూ కీలక పాత్ర పోషించాడు. కేవలం జట్టును గెలిపించడమే కాకుండా, వ్యక్తిగత రికార్డుల విషయంలో కూడా సంజూ ఇప్పుడు భారత దిగ్గజం విరాట్ కోహ్లీని, విధ్వంసకర వీరుడు డేవిడ్ వార్నర్‌ను వెనక్కి నెట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. యువ ఆటగాడు కార్తీక్ శర్మ (41 పరుగులు) విన్నింగ్ షాట్ కొట్టి మెరిస్తే, సంజూ శాంసన్ తన అజేయమైన ఇన్నింగ్స్‌తో రికార్డుల రారాజుగా నిలిచాడు.

విరాట్ కోహ్లీని మించిన సగటు

ఐపీఎల్ 2026లో అత్యుత్తమ బ్యాటింగ్ యావరేజ్ కలిగిన ఆటగాళ్ల జాబితాలో సంజూ శాంసన్ ఇప్పుడు విరాట్ కోహ్లీని అధిగమించి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ సీజన్‌లో 300 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్లలో సంజూదే పైచేయి. ఇప్పటివరకు 10 మ్యాచ్‌ల్లో సంజూ 402 పరుగులు సాధించగా, అతని సగటు 57.43గా ఉంది. అటు విరాట్ కోహ్లీ 379 పరుగులతో 54.14 సగటును కలిగి ఉన్నాడు. ఈ సీజన్‌లో సంజూ ఎంత స్థిరంగా ఆడుతున్నాడో ఈ గణాంకాలే నిదర్శనం.

ఐపీఎల్ 2026లో టాప్ యావరేజ్ (300+ పరుగులు)

57.43 – సంజు శాంసన్ (CSK)

54.67 – శ్రేయాస్ అయ్యర్ (PBKS)

54.29 – ర్యాన్ రికెల్టన్ (MI)

54.14 – విరాట్ కోహ్లీ (RCB)

53.13 – హెన్రిచ్ క్లాసెన్ (SRH)

డేవిడ్ వార్నర్ సిక్సర్ల రికార్డు బద్దలు

కేవలం యావరేజ్ మాత్రమే కాదు, సిక్సర్ల విషయంలో కూడా సంజూ శాంసన్ ఇప్పుడు డేవిడ్ వార్నర్‌ను వెనక్కి నెట్టేశాడు. ఢిల్లీపై జరిగిన మ్యాచ్‌లో సంజూ 6 భారీ సిక్సర్లు బాదాడు. దీనితో అతని ఐపీఎల్ కెరీర్ మొత్తం సిక్సర్ల సంఖ్య 240కి చేరింది. డేవిడ్ వార్నర్ ఇప్పటివరకు 236 సిక్సర్లతో ఉన్నాడు. అంటే వార్నర్‌ను కాదని అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో సంజూ ఒక అడుగు ముందుకు వేశాడు.

సెంచరీ మిస్ అయినా.. చరిత్రలో చోటు

సంజూ శాంసన్ 52 బంతుల్లో 87 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఒకవేళ మరో 13 పరుగులు చేసి ఉంటే, ఈ సీజన్‌లో తన మూడవ సెంచరీని పూర్తి చేసుకునేవాడు. ఒకే సీజన్‌లో మూడు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, జోస్ బట్లర్ వంటి దిగ్గజాల సరసన సంజూ కూడా నిలిచేవాడు. అయితే తన స్వార్థం కంటే జట్టు గెలుపు ముఖ్యమని భావించిన సంజూ, సింగిల్స్ కోసం చూడకుండా గేమ్ ముగించడానికే ప్రాధాన్యత ఇచ్చాడు.

యువ కిరణం కార్తీక్ శర్మ మెరుపులు

చెన్నై విజయంలో సంజూతో పాటు యువ ఆటగాడు కార్తీక్ శర్మ ప్రదర్శన కూడా మరువలేనిది. 41 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన కార్తీక్, ఆఖర్లో ఫోర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. వీరిద్దరి మధ్య కుదిరిన భాగస్వామ్యం ఢిల్లీ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టింది. 156 పరుగుల లక్ష్యాన్ని చెన్నై కేవలం 17.3 ఓవర్లలోనే ఛేదించి, పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది.

 

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..