
సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి జీవిత కల. ఆ కలని సాకారం చేసుకోవడానికి సామాన్యులు తమ రక్తాన్ని చెమటగా మార్చి, పైసా పైసా కూడబెడతారు. మరికొందరు బ్యాంకు రుణాల ద్వారా దశాబ్దాల పాటు ఈఎంఐలు చెల్లిస్తూ గూడు నిర్మించుకుంటారు. కానీ.. సమాజంలో కొందరు మాత్రం అడ్డదారుల్లో సంపాదించిన అక్రమ సొమ్ముతో విలాసవంతమైన భవనాలను నిర్మిస్తున్నారు. డ్రగ్స్ మాఫియా, అవినీతి, స్మగ్లింగ్ వంటి అరాచకాల ద్వారా సంపాదించిన ‘నల్లధనం’ రియల్ ఎస్టేట్ రంగంలోకి పెట్టుబడిగా మారుతోంది. అయితే.. ఇలాంటి అక్రమ కట్టడాలపై ప్రభుత్వాలు ఇప్పుడు ఉక్కుపాదం మోపుతున్నాయి. రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం.
అక్రమ సంపాదన..
రాజస్థాన్కు చెందిన గోవింద్ రామ్ అనే వ్యక్తి అంతర్రాష్ట్ర మాదకద్రవ్యాల రవాణా చేస్తూ కోట్లాది రూపాయలు గడించాడు. ఆ డబ్బుతో తన భార్య పేరిట సుమారు కోటి రూపాయల విలువైన భారీ నివాసాన్ని నిర్మించాడు. అయితే.. పోలీసుల నిఘాలో అతడి అక్రమ సామ్రాజ్యం బయటపడింది. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (NDPS) చట్టం ప్రకారం.. నేరాల ద్వారా సంపాదించిన ప్రతి రూపాయి అక్రమమే. విచారణలో ఆ ఇల్లు డ్రగ్స్ మనీతోనే కట్టినట్లు తేలడంతో అధికారులు ఆ భవనాన్ని సీజ్ చేశారు.
చట్టం ఏం చెబుతోంది?
భారతదేశంలో ఆస్తి కొనుగోలు లేదా నిర్మాణానికి సంబంధించి కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. ఒక వ్యక్తి పెద్ద మొత్తంలో ఖర్చు చేసి ఇల్లు కడుతున్నప్పుడు, ఆ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో ఆధారాలతో సహా నిరూపించాల్సి ఉంటుంది. ఒకరు డబ్బు పెట్టి వేరొకరి పేరిట ఆస్తిని కొనుగోలు చేస్తే.. దానికి సరైన లెక్కలు లేని పక్షంలో ‘బినామీ ఆస్తుల నిషేధ చట్టం’ కింద ప్రభుత్వం దానిని స్వాధీనం చేసుకుంటుంది. మాదకద్రవ్యాల వ్యాపారం ద్వారా సంపాదించిన ఆస్తులను సీజ్ లేదా స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు, దర్యాప్తు సంస్థలకు ఉంటుంది. నేరం నిరూపితమైతే ఆ ఆస్తి ప్రభుత్వ పరం అవుతుంది.
Also Read:New Pensions: శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. వారికి కూడా పెన్షన్లు..
కూల్చివేతలు లేదా స్వాధీనం?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అక్రమ కట్టడాల పట్ల ప్రభుత్వాల వైఖరి మారింది. కేవలం సీజ్ చేయడమే కాకుండా, కొన్ని రాష్ట్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన నేరస్థుల ఇళ్లను ‘బుల్డోజర్లతో’ కూల్చివేస్తున్నారు. ఒకవేళ నేరపూరిత సొమ్ముతో ఆస్తిని కొంటే, దానిని భవిష్యత్తులో ఎవరికీ విక్రయించే హక్కు కూడా ఉండదు.
నేరంతో సంపాదించిన డబ్బుతో నిర్మించిన భవనాలు చూడ్డానికి ‘సౌధాలు’గా కనిపించవచ్చు, కానీ అవి ఎప్పుడూ చట్టం కనుసన్నల్లోనే ఉంటాయి. నీతిగా, కష్టపడి సంపాదించిన సొమ్ముతో కట్టుకున్న చిన్న గూడైనా ఇచ్చే గౌరవం, ప్రశాంతత అక్రమ సంపాదనతో కట్టిన కోటల్లో దొరకదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, నేరస్థుల అక్రమ సామ్రాజ్యాలు కుప్పకూలక తప్పదు.