Reading Time: < 1 minute
Minister Vivek Venkataswamy Promises Pensions To Construction Workers

తెలంగాణలోని కార్మిక వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. సిద్దిపేటలోని పార్టీ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికులతో నిర్వహించిన ప్రత్యేక సమీక్షలో ఆయన పాల్గొని పలు కీలక హామీలు ఇచ్చారు.

కార్మికులకు భరోసా..
భవన నిర్మాణ రంగ కార్మికుల చిరకాల వాంఛ అయిన పెన్షన్ల అంశంపై మంత్రి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే వీరికి పింఛన్లు అందించేలా చర్యలు తీసుకుంటామని, అలాగే ప్రతి జిల్లాలో కార్మిక సంఘాల కోసం ప్రత్యేక సంఘ భవనాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో త్వరలోనే ‘లేబర్ బోర్డు’ను పూర్తిస్థాయిలో పునరుద్ధరించి, లేబర్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు, ప్రమాద బీమా మరియు ఇతర సంక్షేమ పథకాలు అందేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు.

Also Read:MGNREGS: ఉపాధి హామీకి కౌంట్ డౌన్.. ఫుల్ పవర్స్ వారికే..

తమ కుటుంబానికి కార్మికులతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. తన తండ్రి, దివంగత నేత కాకా వెంకటస్వామి సింగరేణి కార్మికుల కోసం చేసిన పోరాటాలను మంత్రి ప్రస్తావించారు. అదే బాటలో నడుస్తూ.. గిగ్ వర్కర్ల రక్షణ కోసం అసెంబ్లీలో ప్రత్యేక చట్టం తెచ్చామని, ప్రమాద బీమాను రూ. 10 లక్షలకు పెంచామని గుర్తుచేశారు. హమాలీల సంక్షేమం కోసం కూడా ప్రత్యేక చట్టం తెచ్చే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు.

గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి హరీశ్ రావు కేవలం ఓట్ల కోసమే హామీలు ఇచ్చారని.. కానీ తమ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో మార్పు తెస్తుందన్నారు. సిద్దిపేట కార్మిక భవన నిర్మాణానికి స్థల కేటాయింపుతో పాటు నిధులు కూడా మంజూరు చేస్తానని మాట ఇచ్చారు.