Reading Time: 2 minutes
హర్మూజ్‌ జలసంధి దగ్గర టెన్షన్.. టెన్షన్.. భారత నౌకలపై ఇరాన్ గన్‌బోట్ల దాడి..

హర్మూజ్‌ వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. హర్మూజ్‌ జలసంధిని మూసేస్తున్నట్లు ఇరాన్‌ ప్రకటించింది. హర్మూజ్‌ దగ్గర అమెరికా దిగ్భంధం కొనసాగడంతో ఇరాన్‌ ఈ నిర్ణయం తీసుకుంది. నిన్న హర్మూజ్‌ను తెరుస్తునట్టు ఇరాన్‌ ప్రకటించింది. అయితే ఇరాన్‌ హర్మూజ్‌ను తెరిచినప్పటికి దిగ్భంధం కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. దీంతో ఇరాన్.. మళ్లీ నిర్ణయాన్ని మార్చుకుంది.. ఇరాన్‌ నిర్ణయంతో హర్మూజ్‌ జలసంధి దగ్గర నౌకల రాకపోకలు నిలిచిపోయాయి. శత్రువుల నౌకలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించే ప్రసక్తే లేదని ఇరాన్‌ ప్రకటించింది. హర్మూజ్‌ పూర్తిగా తమ నియంత్రణలో ఉందని ఇరాన్‌ ప్రకటించింది. ఈ క్రమంలోనే.. హర్మూజ్‌  జలసంధి దగ్గర పలు నౌకలపై ఇరాన్ విరుచుకుపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.. తాజాగా.. హర్మూజ్‌ జలసంధి దగ్గర రెండు భారత నౌకలపై ఇరాన్ గన్ బోట్స్ దాడి చేసినట్లు తెలుస్తోంది. అయితే.. క్ర్యూ సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఇరాన్ రాయబారిని పిలిపించిన కేంద్రం..

హోర్ముజ్ జలసంధిలో ఈరోజు భారత జెండా ఉన్న రెండు నౌకలపై ఇరాన్ గన్‌బోట్లు కాల్పులు జరిపాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, నౌకలకు ఎలాంటి నష్టం జరగలేదని వారు చెప్పారు. అయితే, చమురు వాణిజ్యానికి కీలకమైన ఈ నౌకా మార్గంలో, ఒమన్‌కు ఈశాన్యంగా జరిగిన ఈ ఘటన తర్వాత ఆ రెండు నౌకలు వెనుదిరగాల్సి వచ్చింది. ఈ ఘటనలో ప్రమేయమున్న రెండు నౌకలలో ఒకటి వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్ (VLCC). భారీ పరిమాణంలో ఉండి, సుదూర ముడి చమురు రవాణా కోసం రూపొందించబడిన ట్యాంకర్ ఉంది.. ఈ ఘటన అనంతరం న్యూఢిల్లీ ఇరాన్ రాయబారిని పిలిపించిందని వర్గాలు తెలిపాయి.

ఇదిలాఉంటే.. హర్మూజ్‌ జలసంధి దగ్గరి నుంచి 21 నౌకలను వెనక్కి పంపించినట్టు అమెరికా సైన్యం తెలిపింది. కాగా.. మరోవైపు సోమవారం అమెరికా-ఇరాన్‌ మధ్య రెండో దఫా చర్చలు జరిగే అవకాశాలున్నాయి. అమెరికాతో పూర్తి శాంతిని కోరుకుంటునట్టు ఇరాన్‌ ప్రకటించింది.

యూకే బోట్లపై దాడి..

అంతకుముందు.. హోర్ముజ్‌లో ట్యాంకర్‌పై రెండు ఇరానియన్ గన్‌బోట్లు కాల్పులు జరిపాయని.. సిబ్బంది సురక్షితంగా ఉన్నారు.. యూకే తెలిపింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్‌కు చెందిన రెండు గన్‌బోట్లు తమ ట్యాంకర్‌ను సమీపించాయని, ఎలాంటి రేడియో హెచ్చరిక లేకుండానే ఆ గన్‌బోట్లు “ట్యాంకర్‌పై కాల్పులు జరిపాయని” ట్యాంకర్ కెప్టెన్ నివేదించినట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ ఒక ప్రకటనలో తెలిపింది.