Reading Time: < 1 minute
Dk Shivakumar Apple Video Row Bjp Criticises Karnataka Cm

DK Shiva Kumar: కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డీకే శివకుమార్ తన సొంత నియోజకవర్గం కనకపురలో జరిగిన ఒక సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే, ఈ సమావేశంలో చోటుచేసుకున్న ఘటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఆదివారం కనకపురలో కాంగ్రెస్ కార్యకర్తలు ముఖ్యమంత్రి గౌరవార్థం భారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్రేన్ సాయంతో ఆపిల్ పండ్లతో చేసిన భారీ దండను ఆయనకు బహూకరించారు. సన్మాన కార్యక్రమం తర్వాత శివకుమార్ రెండు ఆపిల్ పండ్లను కొరికి తిన, వాటిని ఒక్కొక్కటిగా అక్కడున్న పార్టీ కార్యకర్తలపైకి విసిరారు. అయితే, వీటిని మహా ప్రసాదంగా భావించిన కాంగ్రెస్ కార్యకర్తలు విసిరేసిన ఆపిల్ ముక్కల కోసం ఎగబడ్డారు.

ఇప్పుడు ఇదే వివాదంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీఎంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ఈ వీడియోను ఎక్స్‌లో షేర్ చేసి, అధికారంలో కోసం ఓటు వేసే ప్రజలపైనే సగం తిన్న ఆపిల్ విసరడం తమాషా కాదని, ఇది కాంగ్రెస్ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుందని బీజేపీ పేర్కొంది. ‘‘గౌరవం అనేది కేవలం మాటలతోనే కాకుండా చేతలతో కూడా వ్యక్తమవుతుందని ,ప్రజలు గౌరవాన్ని ఆశిస్తారు కానీ దానాన్ని కాదు. గౌరవం స్థానంలో అహంకారం చోటుచేసుకున్నప్పుడు, ప్రజలు ప్రతిస్పందిస్తారు’’ అని బీజేపీ ఫైర్ అయింది.