Reading Time: 2 minutes
Off The Record About Will Chandrababu Apply The Kuppam Formula In Kurnool Internal Tdp Issues Spark Debate

Off The Record: 2024 ఎన్నికల వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ బాగా బలహీనంగా ఉండేది. అది ఎంతలా అంటే… 2019లో అసెంబ్లీకి, లోక్‌సభకు జిల్లా నుంచి అస్సలు ప్రాతినిధ్యమే లేనంత. ఇక జెడ్పీ, మున్సిపాలిటీల్లోనూ అదే పరిస్థితి. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే… పార్టీ క్యాడర్ బలంగా వున్నా, కేవలం నాయకుల మధ్య విబేధాలు, వాళ్ళ మీదున్న వ్యతిరేకత లాంటి కారణాలతోనే టీడీపీ వెనుకబడింది. సుమారు రెండు దశాబ్దాల పాటు ఉమ్మడి జిల్లాలో టీడీపీ బలహీనంగానే కనిపించింది. కానీ… 2024 ఎన్నికలకు వచ్చేసరికి అనూహ్యంగా పుంజుకుంది తెలుగుదేశం. జిల్లాలోని మొత్తం 14 అసెంబ్లీ, రెండు లోక్‌సభ నియోజకవర్గాలకుగాను కూటమి12 అసెంబ్లీ, రెండు ఎంపీ సీట్లలో గెలిచింది. అందులో టీడీపీ వాటానే 11 అసెంబ్లీ , 2 ఎంపీ సీట్లు. దీంతో… ఇక పూర్వ వైభవం వచ్చినట్టేనని సంబరపడ్డారు ఇక్కడి తమ్ముళ్లు. కానీ… ఇప్పడు ఒక్కసారి రెండేళ్ళ వెనక్కి తిరిగి చూసుకుంటే… మొత్తం తేడాతేడాగానే కనిపిస్తోందట. పరిస్థితి మళ్లీ అధ్వాన్నంగానే మారుతోందన్నఅభిప్రాయం టీడీపీ వర్గాల్లోనే బలపడుతోంది. అందుకు కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఒక కారణం అయితే… టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో నేతల తీరు మరో కారణం అంటున్నారు. శాసనసభ్యుల తీరు పార్టీకి తీరని నష్టం కలిగించేలా ఉందన్న వాదన బలపడుతోంది.

కొందరు ఎమ్మెల్యేలు నిత్యం వివాదాల్లో చిక్కుకోవడం, నియోజకవర్గాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు, భూ కబ్జా ఆరోపణలు, అక్రమ రిజిస్ట్రేషన్లతో భూములు సొంతం, దౌర్జన్యాలు, అనుచరుల ఆగడాలు వెరసి కూటమి ప్రభుత్వానికి మరకలు అంటుకునేలా చేస్తున్నాయన్నది కేడర్‌ వాయిస్‌. వీటన్నిటికీ మించి ఎమ్మెల్యేలు, ఇతర నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయం లేకపోవడం, కొన్ని నియోజకవర్గాల్లో సీనియర్ నేతలు పార్టీని వీడిపోవడం, దూరంగా ఉండడం లాంటివి నష్టం కలిగిస్తున్నట్టు చెబుతున్నారు. ఆలూరు, మంత్రాలయం, ఆదోని, ఎమ్మిగనూరు, నందికొట్కూరు, డోన్, నంద్యాల, ఆళ్లగడ్డ, శ్రీశైలం నియోజకవర్గాల్లో సమస్యలు అధికంగా ఉన్నాయట. దీంతో.. ఇప్పుడు ఆయా నియోజకవర్గాల్లో కూడా కుప్పం ఫార్ములాను అప్లయ్‌ చేస్తారా అంటూ తాజా చర్చలు జరుగుతున్నాయి. తన సొంత నియోజకవర్గం కుప్పంలో పార్టీ నేతలు గాడి తప్పుతున్నారని గుర్తించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నియోజకవర్గ వ్యవహారాలను చూస్తున్న ఎమ్మెల్సీ శ్రీకాంత్‌ను ఉన్నఫళంగా బాధ్యతల నుంచి తప్పించడం హాట్‌ టాపిక్‌ అయింది. దాంతో.. గాడి తప్పుతున్న కర్నూలు వ్యవహారాలను కూడా అదే స్పీడ్‌తో, అంతే స్ఫూర్తితో సెట్‌ చేస్తారా అంటూ మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు. పార్టీని చక్కదిద్దేందుకు చంద్రబాబు తన నియోజకవర్గం నుంచే ఆపరేషన్ ప్రారంభించారని, జిల్లాలోనూ ఆ ఫార్ములాను అమలు చేస్తే బాగుంటుందని కొందరు అంటుంటే… అలా చేస్తారా అంటూ క్వశ్చన్‌ మార్క్ ఫేస్‌ పెట్టేవాళ్ళు మరికొందరు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను…. 8 నుంచి 10 చోట్ల అంతర్గత సమస్యలతో సతమతం అవుతోంది టీడీపీ. ఎమ్మెల్యేల తీరుపై విమర్శలు తీవ్రస్థాయిలో ఉన్నట్టు అధిష్టానం దగ్గర కూడా నివేదికలు ఉన్నాయట. ఎమ్మెల్యేలపై ఆరోపణలు ఉన్న నియోజకవర్గాల్లోని పరిస్థితి ఇటీవల సమీక్షించిన చంద్రబాబు ఒక హెచ్చరిక కూడా పంపారట. నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉందో నేరుగా చెప్పి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చినట్టు సమాచారం. అయినా సరే… కొందరి తీరు మారడం లేదనే అభిప్రాయం కూడా పెరుగుతున్నట్టు తెలిసింది. ఈ పరిస్థితుల్లో అందర్నీ సెట్‌ చేయాలంటే… కుప్పం తరహా ట్రీట్ మెంట్‌ను ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా ఇస్తారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. అందులోనూ…. మా నియోజకవర్గంలోనే కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటూ ఎమ్మెల్యేలపై అసంతృప్తిగా ఉన్న కొందరు ఆల్రెడీ ప్రచారం మొదలుపెట్టేశారట. అలాంటి వాళ్ళంతా స్థానిక పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు అధిష్టానానికి చేరవేస్తున్నట్టు తెలుస్తోంది. కుప్పం తరహా ట్రీట్‌మెంట్ ఒక్కరికి ఇచ్చినా… మిగతా నియోజకవర్గాలన్నిటిలో ఎక్కడి వాళ్ళు అక్కడ సెట్ అవుతారన్న అభిప్రాయం పెరుగుతోంది.