
మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్లో శ్రీలంకపై ఘన విజయం సాధించిన భారత్.. ట్రోఫీ అందుకోకుండానే సంబరాలు చేసుకున్న విషయం తెలిసిందే. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చైర్మన్, పాకిస్థాన్కు చెందిన మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు భారత మహిళల జట్టు నిరాకరించింది. ఈ పరిణామంపై తాజాగా బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టత ఇచ్చారు. ట్రోఫీని స్వీకరించకూడదన్నది ఆటగాళ్ల వ్యక్తిగత నిర్ణయం కాదని, బీసీసీఐ తీసుకున్న సంస్థాగత నిర్ణయమని వెల్లడించారు. దేశంలో నెలకొన్న పరిస్థితులు, ప్రజల భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకుని బీసీసీఐ ముందుగానే నిర్ణయం తీసుకుందని.. అదే విషయాన్ని ఏసీసీకి కూడా ముందుగా తెలియజేసినట్లు ఆయన చెప్పారు.
దుబాయ్లో ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 72 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించి ఆసియా కప్ టైటిల్ను సొంతం చేసుకుంది. అయితే అవార్డుల కార్యక్రమంలో మోహ్సిన్ నఖ్వీ శ్రీలంక ఆటగాళ్లకు రన్నరప్ పతకాలను అందించిన అనంతరం భారత జట్టు కోసం వేదికపైనే వేచి చూశారు. హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు మాత్రం ట్రోఫీ స్వీకరణ కార్యక్రమానికి దూరంగా ఉంది. దీంతో ట్రోఫీ లేకుండానే భారత జట్టు టైటిల్ సంబరాలు చేసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత జట్టు ట్రోఫీని స్వీకరించడం సముచితం కాదని బీసీసీఐ భావించిందని సైకియా వెల్లడించారు. ఇది బీసీసీఐ తీసుకున్న సంస్థాగత నిర్ణయమని.. ఈ నిర్ణయం ఆటగాళ్లకు, టోర్నమెంట్కు లేదా క్రికెట్ క్రీడకు వ్యతిరేకంగా తీసుకున్నది కాదని స్పష్టం చేశారు.
గత ఏడాది జరిగిన ఆసియా కప్లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఆ తర్వాత రెండు దేశాల యుద్ధం కూడా చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో 2025 ఆసియా కప్లో పురుషుల భారత జట్టు కూడా మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని అందుకోలేదు. ఇప్పుడు మహిళల జట్టు కూడా అదే వైఖరిని కొనసాగించింది. దీంతో వరుసగా రెండో ఏడాది భారత జట్టు ఆసియా కప్ను గెలుచుకున్నప్పటికీ.. ట్రోఫీ ప్రెజెంటేషన్కు దూరంగా నిలవడం చర్చనీయాంశంగా మారింది.
భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాల నేపథ్యంలో పాకిస్థాన్తో అన్ని క్రికెట్ మ్యాచ్లను బహిష్కరించాలా? అనే చర్చ కూడా కొనసాగుతోంది. అయితే భారత జట్టు ఆసియా కప్లో పాల్గొనడం తమ క్రీడా బాధ్యతల్లో భాగమేనని సైకియా స్పష్టం చేశారు. ప్రభుత్వం అనుమతించిన విధానానికి అనుగుణంగా బహుళ జట్ల టోర్నమెంట్లలో భారత్ తన క్రీడా బాధ్యతలను కొనసాగిస్తుందని తెలిపారు. అయితే ఒక టోర్నమెంట్లో పాల్గొనడం, ఆ టోర్నమెంట్ ట్రోఫీని ఎవరి చేతుల మీదుగా స్వీకరించాలి అనేది రెండు వేర్వేరు అంశాలని సైకియా పేర్కొన్నారు. ఆట స్ఫూర్తికి, అంతర్జాతీయ క్రికెట్పై తమ నిబద్ధతకు ఎలాంటి భంగం కలగలేదని స్పష్టం చేశారు.
ట్రోఫీని చేతబట్టి ఎత్తి సంబరాలు చేసుకోవడం గొప్ప క్షణమే అయినప్పటికీ.. భారత మహిళల జట్టు మైదానంలో సాధించిన విజయమే అత్యంత ముఖ్యమైనదని సైకియా అన్నారు. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని జట్టు అద్భుత ప్రదర్శనతో ఆసియా కప్ను గెలుచుకుందని, ఈ ఘనత మొత్తం భారత క్రికెట్కు గర్వకారణమని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత మహిళల జట్టు దృష్టి ఆసియా క్రీడలపైనే ఉందని సైకియా తెలిపారు. గత ఎడిషన్లో హాంగ్జౌలో సాధించిన స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా భారత జట్టు జపాన్కు బయలుదేరనుంది.