
వినాయకచవితి పండుగ.. ఉత్సవాలను మనదేశంలోనే కాదు.. విదేశాల్లో కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు అక్కడి దేశస్థులు.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మహిమ గల.. కొన్ని ప్రత్యేకతలు కలిగి.. నియమాలున్నా గణపతి ఆలయాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి.. వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విదేశీ విఘ్నేశ్వరుడి ఆలయాల గురించి తెలుసుకుందాం. . .!
విఘ్నాలకు అధిపతి గణాలకు అధినేత, దైవశక్తుల్లో ముఖ్యుడు… పనులు సజావుగా సాగాలంటే గణపతి పూజ చేయాల్సిందే.. పైగా ఈ ఆదిదేవుడు సిరి సంపదలకు, విజయాలకు, అభివృద్ధికి కారకుడని భక్తులకు గట్టి నమ్మకం.. ఇదే విషయాన్ని పండితులు కూడా చెబుతుంటారు. ఆ నమ్మకం మన దగ్గరే కాదు. విదేశీ ప్రజలకు కూడా ఉంది. అందుకే గుళ్లు కట్టి మరీ పూజిస్తున్నారు. విలక్షణ రూపాలతో, మారు పేర్లతో అందరివాడిగా విఘ్నేశుడు ప్రపంచం నలుమూలలా పూజలు అందుకుంటున్నాడు.
కరెన్సీ నోట్ల మీద గజా….
ఇండోనేసియాలో “గజా” పేరుతో వినాయకుడు పూజలు అందుకుంటు న్నాడు. అక్కడి ప్రజలు గజాను రక్షకుడిగా భావిస్తారు. ఎనిమిదవ శతాబ్దం నుంచే గణనాథుడికి ఇక్కడ ఆలయాలు ఉన్నట్లు చారిత్రక ఆధారాలు చెపుతున్నాయి. ముఖ్యంగా పదిహేను ఆలయాల్లో ఇప్పటికీ ప్రతీరోజు పూజలు జరుగుతున్నాయి.
ఆధ్యాత్మికంగానే కాకుండా తమ దేవుడికి ఎన్నో రకాలుగా గౌరవం ఇస్తున్నారు ఇక్కడి ప్రజలు. ఇండోనేసియాలోనే అతిపెద్ద ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ ఐటీబీ (బన్ దుంగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) లోగోగా గణేశుడి రూపం ఉంటుంది. అంతేకాదు కరెన్సీ నోట్ల మీద కూడా గజా రూపాన్ని ముద్రించింది అక్కడి ప్రభుత్వం.
గుడిలో ఉచిత దర్శనం
బాలీ ద్వీపానికి ఈశాన్య దిశగా ఐదు మైళ్ల దూరంలో ‘మెంజంగన్ ఐల్యాండ్’ ఉంది. మెంజంగన్ అంటే ‘దుప్పి’ అని అర్థం. వసంత ఋతువులో దుప్పులు మందలుగా ఈ ద్వీపానికి వస్తుంటాయి. కిలోమీటర్ పైగా అవి గుంపులు గుంపులుగా వచ్చే దృశ్యం చూడటానికి బాగుంటుంది. అందుకే స్థానికులు ఈ ద్వీపానికి ‘మెంజంగన్’ అని పేరు పెట్టారు.
ఈ ద్వీపంలో సముద్రం ఒడ్డున ఉంది పుర సెగర గిలి ధర్మ కెన్ కనా ఆలయం. ఈ గుడిలో పెద్ద గణేశుడి పాలరాతి విగ్రహం పూజలు అందుకుంటోంది. ఈ దేవుడు సముద్రం నుంచి అక్కడి దీవులను రక్షిస్తాడని స్థానికుల నమ్మకం. ఇరవై నాలుగు గంటలూ తెరిచి ఉండే ఈ గుడిలో ఉచిత దర్శనం ఉంటుంది.
బిల్తార్ రీజియన్ లోని బారా టెంపుల్ (12వ శతాబ్దానికి చెందింది).రాటు బోకో ఆలయం. ఈ గుడిలో విగ్రహం అసంపూర్తిగా ఉంటుంది.
ప్రంబనన్ టెంపుల్ : దీనికే లోరోజోంగ్ రంగ్ అనే మరొక పేరుంది. ఇండోనేసియా లోనే అతి పెద్ద హిందూ దేవాలయం ఇది. (9 శతాబ్దానికి చెందింది). ఈ శివాలయం కాంప్లెక్స్ లోని వినాయకుడి గుడిలోకి పెళ్లి కాని మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు.
పెనాతరన్ ఆలయం.. 12 శతాబ్దానికి చెందిన ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకుంగి. అయినా పూజలు మాత్రం జరుగుతున్నాయి. ఈ గుడిని బాగు చేయాలనే డిమాండ్ తో సోషల్ మీడియాలో ఒక కాంపెన్ అయ్యింది.
బాలి ద్వీపంలోని పుర లుహూర్ ఉలువాటు ఆలయం : ఈ గుడి గేట్ దగ్గర గణేశుడి పాత విగ్రహాలు రెండు ఉంటాయి. వీటికి ప్రత్యేక పూజలు జరిపిన తర్వాతే ఆలయంలోని స్థానిక దేవుళ్ల విగ్రహాలకు పూజలు చేస్తారు.
బౌద్ధ, హిందూ దేవాలయంగా పేరున్న పుర బ్లాన్ జోంగ్.. బాలిలోని సనుర్ ప్రాంతంలో ఈ గుడి ఉంది. ఈ గుడికాంప్లెక్స్ లో గణేశుడి మండపం 9వ శతాబ్దానికి చెందింది. బ్రాహ్మణులు మాత్రమే ఈ గణేశుడికి పూజలు చేసేందుకు అర్హులు.
సురబయలోని సంగ్గార్ అగుంగ్ టెంపుల్: ఈ గుడిలోని విఘ్నేశుడికి హిందువులు, బౌద్దులలతో పాటు చైనీయులు, లోకల్ కమ్యూనిటీ కెనావెన్ ప్రజలు పూజిస్తారు.