
Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ కపుల్ కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణేష్ చతుర్థి వేడుకలు ప్రత్యేకంగా జరిగాయి. ప్రతి ఏడాది తమ కుటుంబంలో వివిధ పండుగలను ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ జంట.. ఈసారి మాత్రం పర్యావరణహితమైన గణపతి విగ్రహంతో అందరి దృష్టిని ఆకర్షించింది. సైఫ్ అలీ ఖాన్ స్వయంగా మట్టితో గణపతి విగ్రహాన్ని తయారు చేస్తున్న ఫొటోలను కరీనా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్గా మారాయి. అయితే ఆ మట్టి గణపతి విగ్రహాన్ని తయారు చేసింది ఎవరో తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.
కరీనా సోషల్ మీడియాలో పంచుకున్న ఫొటోల్లో సైఫ్ అలీ ఖాన్ తెల్లటి కుర్తా పైజామా ధరించి నేలపై కూర్చుని మట్టితో గణపతి విగ్రహాన్ని తయారు చేస్తున్నట్లు కనిపించారు. ఎలాంటి హంగామా లేకుండా ఇంట్లోనే మట్టి విగ్రహాన్ని తయారు చేస్తూ సైఫ్ కనిపించడం అభిమానులను ఆకట్టుకుంది. పర్యావరణానికి హాని కలిగించని మట్టి విగ్రహాన్ని ఎంచుకోవడంతో నెటిజన్ల నుంచి ప్రశంసలు కూడా వస్తున్నాయి.
అయితే ఆ తర్వాత కరీనా షేర్ చేసిన మరో ఫొటో అసలు ట్విస్ట్ను బయటపెట్టింది. చెక్క టేబుల్పై అందంగా తయారైన గణపతి విగ్రహాన్ని చూపిస్తూ.. ఆ విగ్రహాన్ని తన చిన్న కుమారుడు జెహ్ (జహంగీర్ అలీ ఖాన్) తయారు చేశాడని కరీనా వెల్లడించింది. కరీనా ఈ ఫొటోకు ‘మేడ్ బై మై జెహ్ బాబా’ అంటూ క్యాప్షన్ ఇస్తూ, అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
కరీనా, సైఫ్ కుటుంబం పండుగలను జరుపుకునే విధానం కూడా ఎప్పుడూ ఆసక్తిని కలిగిస్తూనే ఉంటుంది. కరీనా పంజాబీ కపూర్ కుటుంబానికి చెందినవారు కాగా, సైఫ్ ముస్లిం పటౌడీ కుటుంబం నుంచి వచ్చారు. 2012లో వివాహం చేసుకున్న ఈ జంటకు తైమూర్ అలీ ఖాన్, జహంగీర్ అలీ ఖాన్ ఇద్దరు కుమారులు. తమ ఇంట్లో రెండు కుటుంబాల సంప్రదాయాలకు గౌరవం ఇస్తూ వివిధ పండుగలను కలిసి జరుపుకోవడం వీరి కుటుంబంలో ఒక ప్రత్యేకతగా మారింది.
దీపావళి, క్రిస్మస్తో పాటు ఈద్ వంటి పండుగలను కూడా కరీనా, సైఫ్ తమ పిల్లలతో కలిసి జరుపుకుంటుంటారు. ఇప్పుడు గణేష్ చతుర్థి సందర్భంగా కూడా మట్టి గణపతిని తయారు చేయడం ద్వారా తమ ఇంట్లోని ఈ సంప్రదాయాలను మరోసారి చూపించారు. ముఖ్యంగా పిల్లలను కూడా ఈ వేడుకల్లో భాగం చేయడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక సినిమాల విషయానికి వస్తే కరీనా కపూర్ ప్రస్తుతం మేఘనా గుల్జార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దాయరా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్తో కలిసి ఆమె నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదల కానుంది.