
IAF Report: ఆపరేషన్ సిందూర్ దాడులతో పాకిస్తాన్లో భారత్ విధ్వంసమే సృష్టించింది. తాజాగా కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 2025-26 వార్షిక నివేదికలో భారత వైమానిక దళం (IAF) కీలక విషయాలను వెల్లడించింది. 2025 ఏప్రిల్లో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిగా భారత్ మే6-7, 2025న ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూకశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను భారత్ లక్ష్యంగా చేసుకుంది. అనంతరం పాకిస్థాన్ భారత సైనిక, పౌర ప్రాంతాలపై దాడులకు ప్రయత్నించడంతో భారత్ పాకిస్థాన్ సైనిక స్థావరాలపై దాడులు చేసింది.
పాక్ ఎయిర్ బేసులు ధ్వంసం..
ఐఏఎఫ్ నివేదిక ప్రకారం.. పాకిస్తాన్ భారత్ పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, వైమానిక దాడులు చేసే ప్రయత్నం చేయడంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధీటుగా స్పందించింది. పాక్లోని నూర్ ఖాన్, రహీమ్ యార్ ఖాన్, జాకోబాబాద్ వైమానిక స్థావరాలతో పాటు పలు కీలక స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో హ్యాంగర్లు, రన్వేలు ధ్వంసమయ్యాయి.
జకోబాబాద్ ఎయిర్ బేసులో నాలుగు విమాన హ్యాంగర్లపై దాడి చేసినట్లు వెల్లడించింది. ఈ దాడుల్లో పాక్కు చెందిన F-16 యుద్ధ విమానాలు, ఒక AEW&C విమానం, అలాగే టర్కీకి చెందిన అకిన్సీ, TB-2 తరగతికి చెందిన పలు మానవరహిత కాంబాట్ ఏరియల్ వెహికల్స్ (UCAVs) ధ్వంసం లేదా దెబ్బతిన్నాయని పేర్కొంది. పాక్ సైన్యానికి చెందిన పలువురు మరణించినట్లు వెల్లడించింది.
రాడార్లు, కమాండ్ సెంటర్లు ఖతం..
పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థకు చెందిన రాడార్లు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు ఐఏఎఫ్ వెల్లడించింది. చక్లాలా, రహీమ్ యార్ ఖాన్, సుక్కూర్, మురీద్, సర్గోధా, జాకోబాబాద్, భోలారీ ప్రాంతాల్లోని కీలక వైమానిక రక్షణ కేంద్రాలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టార్గెట్ చేసినట్లు నివేదిక పేర్కొంది. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ డిఫెన్స్ కమాండ్ ప్రధాన కార్యాలయం చక్లాలో ఉన్నట్లు నివేదిక చెప్పింది. మొత్తం 6 రాడార్లు, 2 ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే గైడెడ్ వెపన్స్ ప్రాంతాలపై దాడులు చేసినట్లు తెలిపింది. సర్గోధా, రహీమ్ యార్ ఖాన్, ఎయిర్ బేస్ రన్వేలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు నివేదిక వెల్లడించింది.
S-400తో 314 కిలోమీటర్ల దూరంలో భారీ దాడి..
ఆపరేషన్ సిందూర్తో S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా 314 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకిస్తాన్కు చెందిన ఒక ప్రత్యేక మిషన్ విమానాన్ని ధ్వంసం చేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ నివేదిక తెలిపింది. ఈ ఘటనను ప్రపంచంలోనే అత్యంత దూరం నుంచి జరిగిన ‘సర్ఫేస్-టు-ఎయిర్ కిల్’గా ఐఏఎఫ్ అభివర్ణించింది. అయితే, కూలిన పాకిస్తాన్ విమానం ఏ రకం అనేది నివేదికలో వెల్లడించలేదు.
ఆపరేషన్ సమయంలో ఆకాశ్, పచోరా, ఓఎస్ఏ-ఏకే ప్లాట్ఫారమ్ల ఉపయోగించినట్లు ఐఏఎఫ్ తెలిపింది. ఈ వ్యవస్థల సమన్వయం ద్వారా డ్రోన్లు, క్షిపణులు, యూఏవీలు, లోయిటరింగ్ మ్యూనిషన్ల వంటి గగనతల దాడుల్ని అడ్డుకున్నట్లు వెల్లడించింది.