
Amol Muzumdar: మహిళల ఆసియా కప్ 2026ను కైవసం చేసుకుని భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. కానీ, ట్రోఫీ ప్రెజెంటేషన్ సమయంలో జరిగిన ఊహించని పరిణామాలు ఇప్పుడు క్రీడాలోకంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. శ్రీలంకపై 72 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఘనంగా ఛాంపియన్గా నిలిచినప్పటికీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) చీఫ్ అయిన మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా విజేత ట్రోఫీని స్వీకరించడానికి భారత జట్టు నిరాకరించింది. అయితే ఈ సంచలన నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాన్ని భారత మహిళా క్రికెట్ జట్టు ముఖ్య కోచ్ అమోల్ మజుందార్ స్పష్టం చేశారు. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోకూడదని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి జట్టులోని ప్రతి ఒక్కరూ పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచారని ఆయన వెల్లడించారు.
ట్రోఫీ అందుకోకపోవడంపై స్పందించిన కోచ్ మజుందార్, ఈ వివాదం తమ విజయం ప్రాముఖ్యతను తగ్గించలేదని స్పష్టం చేశారు. మ్యాచ్ ముగిసిన అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. “మేము ఛాంపియన్లుగా నిలిచాం, మాకు అది చాలు” అని వ్యాఖ్యానించారు. స్టేడియంలోని పెద్ద బోర్డుపై ‘భారత్ ఆసియా కప్ 2026 ఛాంపియన్’ అని స్పష్టంగా రాసి ఉందని, తమకు అంతకంటే పెద్ద గుర్తింపు మరొకటి అవసరం లేదని ధీమా వ్యక్తం చేశారు. బోర్డు తీసుకున్న నిర్ణయానికి తమ యూనిట్ కట్టుబడి ఉందన్న ఆయన, ఈ విషయంలో ఎలాంటి విచారం లేదా పశ్చాత్తాపం లేదన్నారు. ఆటగాళ్లతో పాటు సపోర్ట్ స్టాఫ్ చేసిన కృషి పట్ల తనకు ఎంతో గర్వంగా ఉందని, ఈ టోర్నీ అధికారికంగా పూర్తయిందని చెబుతూ తమ తదుపరి లక్ష్యం రాబోయే ఏషియన్ గేమ్స్ అని స్పష్టం చేశారు.
మరోవైపు ఈ వివాదంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఆరంభం నుంచే నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి భారత్ సుముఖంగా లేదని స్పష్టం చేశారు. ఈ డెడ్లాక్ను తొలగించేందుకు బీసీసీఐ ఆయన ముందు రెండు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు ఉంచిందని తెలిపారు. మొదటిగా ఏసీసీ ఉపాధ్యక్షుడు ఖాలిద్ అల్ జరూనీ చేతుల మీదుగా ట్రోఫీ ఇప్పించాలని, లేదా ఇటీవల వస్తున్న సంప్రదాయం ప్రకారం విజేత బోర్డు ప్రతినిధే తమ జట్టుకు ట్రోఫీని అందజేసేలా చూడాలని కోరారు. అయితే మొహ్సిన్ నఖ్వీ ఈ రెండు ప్రతిపాదనలను తిరస్కరించి, ట్రోఫీని తానొక్కడినే ఇస్తానని మొండిపట్టు పట్టారు. ఈ పట్టుదల కారణంగా చివరకు భారత జట్టుకు ట్రోఫీ తీసుకోలేదు.