Reading Time: < 1 minute
Chamari Athapaththu Emotional After Sri Lankas Asia Cup Final Loss

Chamari Athapaththu comments on Sri Lanka’s Asia Cup Final Loss: మహిళల ఆసియా కప్‌ 2026 ఫైనల్‌లో భారత్ చేతిలో ఓటమిపై శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు స్పందించింది. ఒక జట్టు గెలవడం, మరో జట్టు ఓడిపోవడం ఆటలో భాగమేనని చెప్పింది. అయితే ఫైనల్‌లో తమ జట్టు అత్యుత్తమ క్రికెట్ ఆడలేకపోయిందని, చాలా చెత్తగా ఆడాం అని అంగీకరించింది. పవర్‌ప్లేలో బౌలింగ్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, భారత్ మాత్రం చాలా అద్భుతంగా ఆడిందని ప్రశంసించింది. ఓటమి ఖాయం అనుకున్న సమయంలో కన్నీరు ఆపుకోలేకపోయాను అని ఆటపట్టు భావోద్వేగం చెందింది.

ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో శ్రీలంక 20 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది. మ్యాచ్ అనంతరం చమరి ఆటపట్టు మాట్లాడుతూ… ‘ఈ ఓటమితో మేము నిరాశ చెందాల్సిన అవసరం లేదు. త్వరలోనే ఆసియా క్రీడలు జరగనున్న నేపథ్యంలో మా ఆటలోని లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. మేం తప్పకుండా తిరిగి పుంజుకుంటాం. ఇంకా చాలా అంశాల్లో మెరుగుపడాలి. మా ప్రణాళికలను మైదానంలో సరిగ్గా అమలు చేయడంపై దృష్టి పెట్టాలి’ అని తెలిపింది.

ఆసియా కప్‌ టోర్నీలో ఫైనల్ మినహా శ్రీలంక జట్టు మంచి క్రికెట్ ఆడిందని చమరి ఆటపట్టు చెప్పింది. ‘టోర్నీలో మేము కొన్ని బలమైన జట్లను ఓడించాము. ఫైనల్ మినహా అన్ని మ్యాచ్‌లలో బాగా ఆడాం. ఈ రోజు కాస్త ఇబ్బందిపడ్డాము. ఈ ఒక్క మ్యాచ్ ఫలితంతో మా జట్టు సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదు. టోర్నీ మొత్తం మీద లంక తరఫున పలువురు ఆటగాళ్లు మెరుగ్గా రాణించారు. ముఖ్యంగా హర్షిత, ప్రభోదా, నిలాక్షిక మంచి ప్రదర్శన కనబరిచారు. టోర్నీలో సాధించిన సానుకూల అంశాలన్నింటినీ తదుపరి సిరీస్‌కు తీసుకెళ్తాము’ అని శ్రీలంక కెప్టెన్ వెల్లడించింది.