Reading Time: 2 minutes
Jasprit Bumrah Reaches 350 T20 Wickets On India Comeback

Jasprit Bumrah 350 T20I Wickets: అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుత పునరాగమనం చేశాడు. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి ఓవర్‌లోనే వికెట్ తీసిన బుమ్రా.. మొత్తంగా నాలుగు ఓవర్లలో 26 రన్స్ ఇచ్చాడు. ఇటీవలి కాలంలో భారీగా పరుగులు ఇస్తూ వికెట్స్ తీయలేకపోతున్న బూమ్ బూమ్.. ఈ మ్యాచ్‌లో తన మునుపటి లయను అందుకున్నాడు. ఇక ఈ వికెట్‌తో బుమ్రా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

మ్యాచ్ తొలి ఓవర్‌లోని రెండో బంతికే అఫ్గానిస్థాన్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్‌ను జస్ప్రీత్ బుమ్రా పెవిలియన్‌కు పంపించాడు. దీంతో టీ20 క్రికెట్‌లో 350 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. భారత్ తరఫున టీ20ల్లో 350 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో బుమ్రా చేరాడు. బుమ్రా కంటే ముందు ఈ ఘనత సాధించిన భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చహల్ ఉన్నారు. ఈ అరుదైన క్లబ్‌లో చేరిన మూడో భారత బౌలర్‌గా బుమ్రా నిలిచాడు.

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో ఎడమ మోకాలికి గాయం కావడంతో జస్ప్రీత్ బుమ్రా కొంతకాలం క్రికెట్‌కు దూరమయ్యాడు. ఆ గాయం కారణంగా ఇంగ్లండ్ సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లతో పాటు జింబాబ్వే, శ్రీలంక సిరీస్‌లకు కూడా దూరంగా ఉన్నాడు. తాజాగా అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్ ద్వారా భారత జట్టులోకి తిరిగి వచ్చాడు. అయితే బుమ్రా పునరాగమనం మాత్రం షాకింగ్‌గా ప్రారంభమైంది. అతడు వేసిన మొదటి బంతి లెగ్ సైడ్‌కు చాలా దూరంగా వెళ్లడంతో అదనంగా ఐదు పరుగులు వచ్చాయి. బంతి కీపర్ సంజూ శాంసన్ గ్లవ్స్‌ను దాటి బౌండరీకి వెళ్లింది. శాంసన్ ఎంత ప్రయత్నించినా బంతిని అడ్డుకోలేకపోయాడు.

అయితే ఆ తర్వాతి బంతి నుంచే జస్ప్రీత్ బుమ్రా తన అసలు రిథమ్‌ను అందుకున్నాడు. ఊహించని బౌన్స్‌తో గుర్బాజ్ వికెట్ పడగొట్టాడు. అభిషేక్ శర్మ డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. దీంతో బుమ్రా 350 టీ20 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. మ్యాచ్‌కు ముందు అఫ్గానిస్థాన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్.. బుమ్రాను ఎదుర్కొనేందుకు తమ వద్ద ప్రణాళికలు ఉన్నాయని చెప్పాడు. భారత్‌లోని పరిస్థితులపై కూడా తమకు అవగాహన ఉందని, ఆ ప్రణాళికలను మైదానంలో సరిగ్గా అమలు చేయడమే తమకు కీలకమని పేర్కొన్నాడు. అయితే మ్యాచ్‌లో మాత్రం అఫ్గాన్ బ్యాటర్లకు మనోళ్లు చుక్కలు చూపించారు. భారత బౌలర్ల ధాటికి పవర్‌ప్లేలోనే అఫ్గానిస్థాన్ నాలుగు వికెట్లు కోల్పోయింది. ఏడో ఓవర్‌లోనే ఐదో వికెట్ కూడా పడటంతో ఆ జట్టు తీవ్ర ఇబ్బందుల్లో పడింది. బుమ్రా పునరాగమనంతో భారత బౌలింగ్‌కు మరింత బలం చేకూరగా.. 350వ టీ20 వికెట్‌తో స్టార్ పేసర్ తన రీఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు.