కావలసిన పదార్థాలు: 2 కప్పుల కరివేపాకు, సరిపడినంత నూనె, అర స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చి, గుప్పెడు – తొక్కలు వలిచినవి వెల్లుల్లి రెబ్బలు
2 నుండి 3 – చీలికలు పచ్చిమిర్చి, 4 సన్నగా తరిగిన ఉల్లిపాయలు, చిటికెడు పసుపు, 2 స్పూన్ల కారం పొడి, చేదును బ్యాలెన్స్ చేయడానికి బెల్లం, నిమ్మకాయ సైజు చింతపండు, రుచికి సరిపడా ఉప్పు మరియు సరిపడా నీళ్లు
తయారీ విధానం: స్టవ్ వెలిగించి బాండీ లేదా మట్టి పాత్రలో 2-3 స్పూన్ల నూనె వేడిచేయాలి. అందులో తడిలేని 2 కప్పుల కరివేపాకు వేసి మీడియం మంటపై ఆకులు బాగా క్రిస్పీగా మారే వరకు వేయించాలి. వేగిన కరివేపాకును నూనె రాకుండా గిన్నెలోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో లేదా రోట్లో వేసి చాలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
మిగిలిన నూనెలో సరిపడా నూనె చేర్చి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. అందులోనే గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు వేసి దోరగా వేపాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసి మూతపెట్టి ఉల్లిపాయలు మెత్తగా, ఎర్రగా మగ్గే వరకు మధ్యమధ్యలో కలుపుతూ వేయించాలి.
ఉల్లిపాయలు మగ్గాక పసుపు, కారం పొడి, గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పేస్ట్ మరియు చిన్న బెల్లం ముక్క వేసి కలపాలి. కరివేపాకులోని వగరు, ఘాటును బ్యాలెన్స్ చేసి కూరకు అద్భుతమైన రుచిని ఇవ్వడానికి బెల్లం చాలా అవసరం. ఇందులో అరకప్పు నీళ్లు పోసి మూతపెట్టి చిన్న మంటపై 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి.
కూర మెత్తగా మగ్గిన తర్వాత చింతపండు రసం, గ్రేవీకి సరిపడా నీళ్లు పోసి ఉప్పు, కారాలు సరిచూసుకోవాలి. మూతపెట్టి చిన్న మంటపై నూనె పైకి తేలేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. మట్టి పాత్రలో వండితే ఈ కూర రుచి రెట్టింపవుతుంది. ఈ కరివేపాకు పులుసు కూరలో వెల్లుల్లిపాయలు నోట్లో వెన్నలా కరిగిపోతూ అమృతంలా ఉంటాయి. వేడివేడి అన్నం, జొన్న రొట్టెల్లోకి ఇది బెస్ట్ కాంబినేషన్!




