Reading Time: < 1 minute
Ambati Rayudu India Openers Shubman Gill Sai Sudharsan 2028 T20 World Cup

భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు 2028 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు ఎలా ఉండబోతుందనే దానిపై కొన్ని ఆసక్తికరమైన అంచనాలు వేశాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్‌లో చాలా మంది ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. దీనివల్ల రాబోయే రోజుల్లో జట్టు ఎంపిక సెలెక్టర్లకు పెద్ద సవాలుగా మారనుంది. ముఖ్యంగా 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ 16 మ్యాచ్‌ల్లో ఏకంగా 776 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అతడు రాబోయే వరల్డ్ కప్ టీంలో కీలక ఆటగాడిగా ఉంటే అవకాశం ఉందన్నారు.

వీరితో పాటు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ కూడా స్థిరంగా రాణిస్తూ ఆకట్టుకుంటుండగా.. వారికి కూడా అంబటి రాయుడు స్థానం కల్పించాడు. అయితే.. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ ప్రపంచకప్‌లో భారత జట్టు తరఫున ఇన్నింగ్స్ ప్రారంభించాలని రాయుడు అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో గిల్, సుదర్శన్ జోడీ అత్యంత ప్రమాదకరమైన ఓపెనింగ్ జంటగా ఎదిగింది. ఈ సీజన్‌లో వీరిద్దరూ కలిసి ఇప్పటివరకు 885 పరుగులు చేశారు. ఐపీఎల్ చరిత్రలో ఒక ఓపెనింగ్ జోడీ సాధించిన అత్యధిక పరుగుల రికార్డు (939 పరుగులు) విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. ఆ రికార్డును అధిగమించడానికి వీరు కేవలం 54 పరుగుల దూరంలో ఉన్నారు.

రాయుడు మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి వేగవంతమైన పిచ్‌లపై గిల్, సుదర్శన్ ఆటతీరు భారత్‌కు బాగా కలిసి వస్తుందని చెప్పాడు. వారిద్దరి బ్యాటింగ్ శైలి అక్కడి పరిస్థితులకు సరిగ్గా సరిపోతుందని, ఒకరి ఆటను మరొకరు బాగా అర్థం చేసుకుని ఆడతారని ప్రశంసించాడు. అయితే.. ఐపీఎల్‌కు ముందే గిల్‌ను భారత టీ20 జట్టు నుండి పక్కన పెట్టడం గమనార్హం.

మరోవైపు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు టామ్ మూడీ స్పందిస్తూ.. ఐపీఎల్ ప్రదర్శన చూసి సెలెక్ట్ చేయడం అంత సులువు కాదని, అంతర్జాతీయ క్రికెట్‌లో ఒత్తిడి వేరేలా ఉంటుందని గుర్తుచేశాడు. ఐపీఎల్‌లో బాగా ఆడితే నేరుగా టెస్ట్ జట్టులోకి కూడా వచ్చేసేంత పోటీ ప్రస్తుతం భారత్‌లో ఉందని ఆయన అభిప్రాయపడ్డాడు.