Reading Time: 2 minutes
Mega Dsc 2025 Ap School Education Department Warns Of Criminal Cases Over False Propaganda

Mega DSC 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా డీఎస్సీ-2025 ఉపాధ్యాయ నియామక ప్రక్రియపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా 15,941 ఉపాధ్యాయ పోస్టుల భర్తీని పూర్తి పారదర్శకతతో, అత్యాధునిక సాంకేతిక విధానాల ఆధారంగా విజయవంతంగా పూర్తి చేశామని విద్యాశాఖ స్పష్టం చేసింది. విద్యాశాఖ విడుదల చేసిన ప్రకటనలో, నియామక ప్రక్రియ మొత్తం ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు, రిజర్వేషన్ విధానాలు, చట్టబద్ధమైన మార్గదర్శకాలకు అనుగుణంగానే నిర్వహించామని తెలిపింది. ప్రతి దశలో డిజిటల్ భద్రతా వ్యవస్థలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ, జిల్లా స్థాయి ధృవీకరణ ప్రక్రియలను కట్టుదిట్టంగా అమలు చేసినట్లు వెల్లడించింది.

అయితే కొన్ని వార్తాపత్రికలు, సోషల్ మీడియా వేదికలు మరియు కొందరు వ్యక్తులు కావాలనే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విద్యాశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా హారిజాంటల్ రిజర్వేషన్ అమలును సరైన రీతిలో అర్థం చేసుకోకుండా ప్రశ్నాపత్రాల లీకేజీ జరిగిందని, మెరిట్ జాబితాలు విడుదల చేయలేదని, అక్రమ ఎంపికలు జరిగాయని అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. మెగా డీఎస్సీకి సంబంధించిన పూర్తి మెరిట్ జాబితాలు, ఎంపిక జాబితాలు మరియు ఇతర అన్ని వివరాలను నోటిఫై చేసిన విధానం ప్రకారమే పారదర్శకంగా విడుదల చేసినట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. ఎంపిక ప్రక్రియ మొత్తం మెరిట్, రిజర్వేషన్ రోస్టర్ మరియు పలు స్థాయిల ధృవీకరణ వ్యవస్థల ఆధారంగానే జరిగిందని తెలిపింది. ఇందులో ఎలాంటి అక్రమాలకు అవకాశం లేదని పేర్కొంది.

ఇలాంటి తప్పుడు ప్రచారాలు అభ్యర్థుల్లో అనవసర ఆందోళనలు కలిగించడమే కాకుండా విద్యాశాఖ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే తగిన న్యాయపరమైన చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. తప్పుడు ప్రచారం చేసిన మీడియా సంస్థలు, సోషల్ మీడియా వేదికలు మరియు ఇతర బాధ్యులపై పరువు నష్టం నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే సమాజంలో గందరగోళం సృష్టించిన వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయనున్నట్లు హెచ్చరించారు. ప్రజలను, అభ్యర్థులను తప్పుదారి పట్టించేలా నిరాధార ఆరోపణలు చేసిన వారు బహిరంగంగా విద్యాశాఖకు మరియు ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని విద్యాశాఖ డిమాండ్ చేసింది. ప్రభుత్వం చేపట్టే అన్ని నియామక ప్రక్రియల్లో పారదర్శకత, నిష్పక్షపాతత్వం, ప్రతిభ ఆధారిత ఎంపికకు కట్టుబడి ఉంటామని పాఠశాల విద్యాశాఖ మరోసారి స్పష్టం చేసింది. అభ్యర్థులు తప్పుడు వార్తలను నమ్మి ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేసింది. కాగా, మెగా డీఎస్పీపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న విషయం విదితమే..