
హనీమూన్ మర్డర్ కేసు గుర్తింది కదా? ఎవరు మరిచిపోతారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు. హనీమూన్ అనగానే గుర్తుకొచ్చేది సోనమ్ రఘువంశీనే. కాళ్లపారాణి ఆరకముందే.. భర్తను కాటికి పంపేసిన ఇల్లాలు. మరిచిపోయే ఘటమా? ప్రస్తుతం బెయిల్పై షిల్లాంగ్లో మకాం వేసింది.
తాజాగా ఓ ప్రైవేటు మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేసింది. నేపాల్కు పారిపోయినట్లు వస్తున్న వార్తలన్నీ అబద్ధమని తోసిపుచ్చింది. తాను ప్రస్తుతం షిల్లాంగ్లోనే ఉన్నానని పేర్కొంది. ఇప్పట్లో ఇండోర్కు వెళ్లే ఉద్దేశం లేదని.. పూర్తిగా దర్యాప్తునకు సహకరిస్తున్నట్లు స్పష్టం చేసింది. తనపై వస్తున్న పుకార్లను ఎవరూ నమ్మొద్దని తెలిపింది. ఎల్లప్పుడూ కోర్టు విచారణకు సిద్ధంగా ఉన్నానని.. ఎప్పుడు పిలిచినా సహకరిస్తానని పేర్కొంది. నేపాల్కు పారిపోయినట్లుగా బాధిత కుటుంబం ఆరోపణలను కొట్టిపారేసింది.
సోనమ్తో రిపోర్టర్ ప్రశ్నలు
ప్రశ్న: బెయిల్ తర్వాత కోర్టు షరతులన్నీ పాటిస్తున్నారా?
సోనమ్: అవును.. కోర్టు నుంచి నాకు వచ్చిన బెయిల్ షరతులను నేను ఎల్లప్పుడూ పూర్తిగా పాటించాను. ఆ పరిమితిని నేను ఎప్పటికీ అతిక్రమించను.
ప్రశ్న: బెయిల్ తర్వాత మీరు ఎక్కడ నివసిస్తున్నారు. మీ ఖర్చులను ఎలా నిర్వహిస్తున్నారు.
సోనమ్: నేను ప్రస్తుతం షిల్లాంగ్లో నివసిస్తున్నాను. నేను షిల్లాంగ్ వెలుపల అస్సలు ప్రయాణించలేదు. ఖర్చుల విషయానికొస్తే.. వాటిని నేను వెల్లడించదలుచుకోలేదు. అది వ్యక్తిగత విషయం. భద్రతా కారణాల వల్ల.. షిల్లాంగ్లో నేను కచ్చితంగా ఎక్కడ ఉన్నానో వెల్లడించలేను.
ప్రశ్న: మీరు షిల్లాంగ్ విడిచి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు, మీకు ఇండోర్ వెళ్లే ఉద్దేశం ఏమైనా ఉందా?సోనమ్: లేదు.. ప్రస్తుతానికి ఇండోర్ వెళ్ళే ఆలోచన లేదు. ఎందుకంటే ఇక్కడ నా కేసు ఇంకా నడుస్తోంది. అది పూర్తిగా ముగిసే వరకు నేను ఎక్కడికీ వెళ్లను. కేసు విచారణ ఇంకా జరుగుతోంది. నా గురించి జనాలు అబద్ధాలు చెబుతున్నారు.
ప్రశ్న: మొదటి రోజు నుంచే ప్రజాభిప్రాయం మీకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపిస్తోంది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
సోనమ్: నా కేసు ప్రస్తుతం కోర్టులో విచారణలో ఉంది. కాబట్టి నేను ఇప్పుడప్పుడే ఈ విషయంపై ఇంకేమీ చెప్పదలుచుకోలేదు.
ప్రశ్న: కోర్టు విచారణలో సహకరించడానికి మీకున్న నిబద్ధత గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు?
సోనమ్: అవును.. నేను అన్ని కోర్టు విచారణలకు ఎల్లప్పుడూ పూర్తిగా సహకరించాను. ఇకపైనా అలాగే కొనసాగిస్తాను. నాపై విధించిన అన్ని షరతులను నేను పాటిస్తున్నాను. మన న్యాయ వ్యవస్థ పట్ల నాకు ఎల్లప్పుడూ అపారమైన గౌరవం ఉంది, ఇకపైనా కూడా అది కొనసాగుతుంది.
సోనమ్ లాయర్తో సంభాషణ..
ప్రశ్న: మృతుడి సోదరుడు విపిన్ రఘువంశీ.. సోనమ్ రఘువంశీ నేపాల్ పారిపోవడానికి మీరు సహాయం చేశారని ఆరోపించారు?
న్యాయవాది సుదీప్ రాణా: ఇది పూర్తిగా అవాస్తవమైన, నిరాధారమైన ఆరోపణ. నేను నేపాలీ సంతతికి చెందినంత మాత్రాన నేను నేపాల్ వాసిని అని గానీ.. అక్కడ నాకు ఏమైనా సంబంధాలు ఉన్నాయని అర్థం కాదు. నేను షిల్లాంగ్లోనే పుట్టి పెరిగాను. నా చదువంతా అక్కడే పూర్తి చేశాను. నేపాల్లో నాకు ఎవరూ లేరు. ఈ ఆరోపణ అబద్ధమని చెప్పడానికి అతిపెద్ద రుజువు ఏమిటంటే.. సోనమ్ ఈరోజు ఇక్కడ ఉండటమే. ఈ కేసు విచారణ ఈరోజు జరగాల్సి ఉండగా.. ఆమె స్వయంగా షిల్లాంగ్లో హాజరయ్యారు. నేను కూడా కోర్టు ప్రాంగణంలోనే ఉన్నాను. దీనివల్ల మేము షిల్లాంగ్ విడిచి వెళ్లలేదని స్పష్టంగా రుజువవుతోంది.
ప్రశ్న: అనుబంధ ఛార్జిషీట్పై జరుగుతున్న విచారణలో సోనమ్ రఘువంశీ పాత్రను మీరు ఎలా చూస్తున్నారు?
న్యాయవాది సుదీప్ రాణా: చూడండి.. ఈ కేసులో అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేయబడింది. ప్రాసిక్యూషన్ (ప్రభుత్వ న్యాయవాది) తమ వాదనలను ముగించింది. మా స్పందనను దాఖలు చేయడానికి ఈరోజు తేదీని నిర్ణయించారు. మేము మా స్పందనను కోర్టుకు సమర్పించాము. ఆయుధాల చట్టం సోనమ్కు వర్తిస్తుందా లేదా అనే విషయమై మేము మా వాదనను ప్రత్యేకంగా వినిపించాం. ఈ అంశంపై స్పందించడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇప్పుడు సోమవారం వరకు సమయం కోరారు. కేసు విచారణలో ఉన్నందున ఇది ప్రస్తుతం విచారణ దశలో ఉందని మాత్రమే మేము చెప్పగలం.

రాజా రఘువంశీ హత్య కేసులో నిందితురాలైన సోనమ్కు ఏప్రిల్ బెయిల్ వచ్చింది. అప్పటి నుంచి షిల్లాంగ్లోనే ఉంటుంది. అయితే న్యాయస్థానం బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ బాధిత కుటుంబం ఇండోర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అంతేకాకుండా సోనమ్ నేపాల్కు పారిపోయిందని ఆరోపించారు. తాజా ఇంటర్వ్యూతో ఆమె షిల్లాంగ్లోనే ఉన్నట్లు తేలిపోయింది.
మే 11, 2025న రాజా రఘువంశీతో సోనమ్కు వివాహం అయింది. మే 23 హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. అయితే ప్రియుడి సాయంతో రాజా రఘువంశీని సోనమ్ చంపేసి లోయలో పడేసింది. జూన్ 3న లోయలో మృతదేహం లభించింది. అనంతరం జూన్ 8న సోనమ్ పోలీసుల ఎదుట లొంగిపోయింది.