Reading Time: < 1 minute
Miss Universe Telangana And Andhra Pradesh 2026 Grand Finale Concludes Successfully In Hyderabad

Hyderabad: మిస్ యూనివర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2026 గ్రాండ్ ఫినాలే విజయవంతంగా ముగిసిన సందర్భంగా విజేతలు, టైటిల్ హోల్డర్లతో ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవల హైదరాబాద్‌లోని సైబర్ గార్డెన్స్‌లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎంపికైన 40 మంది ఫైనలిస్టులు పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు.

ఈ కార్యక్రమానికి మిస్ యూనివర్స్ ఇండియా 2025 మానికా విశ్వకర్మ, మిస్ యూనివర్స్ ఇండియా ఫ్రాంచైజ్ ఆపరేషన్స్ డైరెక్టర్ అంజద్ ఖాన్, మిస్ యూనివర్స్ తెలంగాణ 2025 కాశ్వి హాజరై పోటీదారులను అభినందించారు. అందంతో పాటు నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ ఈ వేదిక యువతులకు స్ఫూర్తిగా నిలుస్తోందని నిర్వాహకులు పేర్కొన్నారు. రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ సునీత, మిస్ యూనివర్స్ తెలంగాణ 2025 కాశ్వి, మిస్ యూనివర్స్ తెలంగాణ 2026 విజేత హసిత నారాయణభట్ట, ఫస్ట్ రన్నరప్ సృష్టి కనిందే, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ 2026 విజేత ఫసీహా నౌమాన్, ఫస్ట్ రన్నరప్ హిమ వర్మ, సెకండ్ రన్నరప్ సోనాలి యాదవ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విజేతలు తమ విజయ ప్రయాణం, ఎదుర్కొన్న సవాళ్లు, భవిష్యత్ లక్ష్యాల గురించి తెలిపారు. ఆత్మవిశ్వాసం, కృషి, పట్టుదలతో ఏ రంగంలోనైనా విజయాన్ని సాధించవచ్చని యువతకు సందేశం ఇచ్చారు. మహిళా సాధికారత, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ నైపుణ్యాలను ప్రోత్సహించే వేదికగా మిస్ యూనివర్స్ తెలంగాణ, మరియు ఆంధ్రప్రదేశ్ పోటీలు నిలుస్తున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ ఏడాది విజేతలు జాతీయ స్థాయి పోటీల్లో తమ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించనున్నట్లు వారు వెల్లడించారు.