
Jaypee Associates: దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒక భారీ కంపెనీ ప్రస్థానం ముగిసిపోతోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జయప్రకాష్ అసోసియేట్స్ (JAL) షేర్లు ఈ గురువారం (జూన్ 18) నుంచి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)ల నుంచి శాశ్వతంగా డీలిస్ట్ (తొలగింపు) కాబోతున్నాయి. ఈ మేరకు డీలిస్టింగ్కు తుది ఆమోదం లభించిందని కంపెనీ అధికారికంగా ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో ధృవీకరించింది. అయితే, ఈ ప్రక్రియతో కంపెనీలో పెట్టుబడులు పెట్టిన 6 లక్షల మందికి పైగా ఉన్న సామాన్య రిటైల్ ఇన్వెస్టర్ల పరిస్థితి రోడ్డున పడింది. వారికి ఎగ్జిట్ ప్రైస్గా ఒక్క రూపాయి కూడా దక్కకపోవడమే దీనికి ప్రధాన కారణం.
ఇన్వెస్టర్ల సొమ్ము ఎందుకు ‘సున్నా’ అయిపోయింది..
కొత్త రెజల్యూషన్ ప్లాన్ ప్రకారం ఇన్వెస్టర్లకు ఎలాంటి చెల్లింపులు జరగవని జేపీ అసోసియేట్స్ ముందే స్పష్టం చేసింది. కంపెనీ ఆర్థిక స్థితి ఎంత దారుణంగా పడిపోయిందంటే.. దాని ఆస్తుల మొత్తం విలువ (లిక్విడేషన్ వాల్యూ) కనీసం బ్యాంకుల అప్పులను పూర్తిగా తీర్చడానికి కూడా సరిపోలేదు. ఐబీసీ (IBC) నిబంధనల ప్రకారం.. దివాలా ప్రక్రియలో ఆస్తులను విక్రయించినప్పుడు వచ్చే డబ్బును మొదట బ్యాంకులకే చెల్లిస్తారు. బ్యాంకులకే నిధులు సరిపోనప్పుడు, సాధారణ షేర్హోల్డర్లకు ఇచ్చేందుకు రూపాయి కూడా మిగలదు. మార్చి 31, 2026 నాటి గణాంకాల ప్రకారం.. ఈ కంపెనీలో 6.48 లక్షల మంది షేర్హోల్డర్లు ఉండగా, అందులో 6.4 లక్షల మంది సామాన్య రిటైల్ ఇన్వెస్టర్లే. కంపెనీలో వీరి వాటా ఏకంగా 45% కాగా, ఐసీఐసీఐ బ్యాంక్కు 8% వాటా ఉంది. ఇప్పుడు ఈ వాటాలన్నీ పూర్తిగా రద్దయిపోనున్నాయి.
అదానీ ఎంట్రీ.. బ్యాంకులకు భారీ ఉపశమనం!
భారత కార్పొరేట్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘంగా సాగిన దివాలా కేసుల్లో జేపీ అసోసియేట్స్ ఒకటి. దీని కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ (CIRP) జూన్ 2024లో స్టార్ట్ అయ్యింది. ఎట్టకేలకు ఈ ఏడాది మార్చి 17న నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) అలహాబాద్ బెంచ్.. అదానీ ఎంటర్ప్రైజెస్ సమర్పించిన రూ.14,535 కోట్ల భారీ డీల్కు (Resolution Plan) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మెగా డీల్తో జేపీ గ్రీన్స్, జేపీ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ వంటి ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు అదానీ గ్రూప్ వశమయ్యాయి. మే నెలాఖరులోనే అదానీ గ్రూప్ ఈ ప్లాన్ కింద మొదటి విడతగా రూ.6,000 కోట్లను బ్యాంకులకు చెల్లించి పెద్ద ఊరటనిచ్చింది. పవర్ సెక్టార్లోనూ అదానీ గ్రూప్ భారీగా విస్తరించింది. జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ (JPVL)లో 24 శాతం వాటాను దక్కించుకోవడానికి అదానీ పవర్ రూ.2,994 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనితో పాటు, ఉత్తరప్రదేశ్లోని చూర్క్లో ఉన్న 180 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ను కూడా రూ.1,200 కోట్లకు అదానీ గ్రూప్ కొనుగోలు చేస్తోంది. ప్రస్తుతం జేపీ అసోసియేట్స్ షేర్ల ట్రేడింగ్ను మార్కెట్ నిలిపివేసింది. జూన్ 18న ఎక్స్ఛేంజీల నుంచి ఈ షేరు శాశ్వతంగా నిష్క్రమించనుంది. భారీ అప్పుల్లో ఉన్న కంపెనీలలో బ్లైండ్గా పెట్టుబడులు పెడితే.. జీవితకాల కష్టార్జితం ఎలా ‘జీరో’ అవుతుందో చెప్పడానికి జేపీ అసోసియేట్స్ సంక్షోభమే ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. నిజానికి ఇన్వెస్టర్లకు ఇదో పెద్ద గుణపాఠం అని అంటున్నారు.