
Kundu couple NCPI: దేశ రాజకీయాల్లో పెను సంచలనం రేపుతూ పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ సాధారణ ప్రాంతీయ పార్టీ, రాత్రికి రాత్రే లోక్సభలో ఐదో అతిపెద్ద శక్తిగా అవతరించబోతోంది. కేవలం 822 ఓట్లు, రూ. 1.13 లక్షల విరాళాల రికార్డు మాత్రమే ఉన్న ‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా’ (NCPI) ఇప్పుడు దేశ అధికార పీఠాన్ని శాసించే స్థాయికి చేరిందంటే నమ్మగలమా. కానీ ఇది నిజం.. పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC)కి చెందిన సుమారు 20 మంది అసమ్మతి ఎంపీలు ఈ పార్టీలో విలీనం కావాలని నిర్ణయించుకోవడమే దీనికి కారణం. ఈ విలీనానికి లోక్సభ స్పీకర్ ఆమోదం లభిస్తే.. కూటమిలో బీజేపీ తర్వాత ఎన్డీఏ (NDA) ప్రభుత్వంలో ఎన్సీపీఐ రెండో అతిపెద్ద పార్టీగా మారుతుంది.
జీరో నుంచి టాప్-5 లోకి
జనవరి 2023లో కేంద్ర ఎన్నికల సంఘం వద్ద నమోదైన ఈ గుర్తింపు లేని చిన్న పార్టీకి ప్రస్తుతం లోక్సభలో ఒక్క సీటు కూడా లేదు. అయితే టీఎంసీ తిరుగుబాటు ఎంపీల చేరికతో దీని బలం ఒక్కసారిగా 20కి చేరనుంది. దీంతో లోక్సభలో బీజేపీ (240), కాంగ్రెస్ (99), సమాజ్వాదీ పార్టీ (37), డీఎంకే (22)ల తర్వాత ఎన్సీపీఐ 5వ అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. మరోవైపు 28 మంది ఎంపీలతో 4వ అతిపెద్ద ప్రతిపక్షంగా ఉన్న టీఎంసీ బలం కేవలం 9 సీట్లకు పడిపోనుంది. ఎంపీలంతా అనర్హత వేటు పడకుండా యాంటీ డిఫెక్షన్ (ఫిరాయింపుల నిరోధక) చట్టం నుంచి తప్పించుకోవడానికే ఈ వ్యూహాత్మక విలీన మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తుంది.
ఎవరీ కుందు దంపతులు?
ఈ వ్యూహాకత్మక రాజకీయ మలుపు వెనుక ఉత్తర బెంగాల్కు చెందిన ఉత్తీయ కుందు, షెవ్లీ కుందు దంపతులు ఉన్నారు. ఉత్తీయ కుందు ఈ పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా, ఆయన భార్య షెవ్లీ ట్రెజరర్గా ఉన్నారు. బెంగాల్ కొత్త సీఎం సువేందు అధికారితో ఉత్తీయ కుందుకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విలీనంపై పార్టీ వ్యవస్థాపకుడు శంతను దేవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని చెబుతున్నారు. దంపతులు ఇద్దరూ ఏకపక్షంగా, పార్టీ రాజ్యాంగానికి విరుద్ధంగా తమను చీకట్లో ఉంచి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన ఆరోపించారు.
తెరవెనుక బీజేపీ హస్తం..
ఈ ఆకస్మిక రాజకీయ పరిణామాల వెనుక కేంద్ర అధికార పార్టీ బీజేపీ వ్యూహం ఉందనే ప్రచారం గట్టిగా సాగుతోంది. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ నివాసంలో తిరుగుబాటు ఎంపీలతో నిషికాంత్ దూబే, సీఎం రమేష్, సువేందు అధికారి వంటి బీజేపీ అగ్రనేతలు రహస్య సమావేశాలు జరిపినట్లు సమాచారం. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తీవ్రంగా మండిపడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోనే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఈ అక్రమ విలీన డ్రామా నడుస్తోందని ఆయన ఎక్స్ వేదికగా ఆరోపించారు. ఏదేమైనా, ఒక చిన్న అనామక పార్టీ భారత పార్లమెంటరీ వ్యవస్థలో ఇంత పెద్ద శక్తిగా మారడం దేశ రాజకీయ చరిత్రలోనే అత్యంత అరుదైన వింతగా నిలిచిపోనుంది.