Reading Time: 2 minutes
Trump Macron Meeting G7 Summit Iran Deal Ukraine Russia War Talks

ఇరాన్‌తో యుద్ధం వేళ జీ 7 సదస్సుకు హాజరయ్యేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫ్రాన్స్‌కు చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో ట్రంప్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ ఒప్పందంతో ప్రపంచానికి మేలు జరుగుతుందని చెప్పారు. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధంపై దృష్టి పెడతామని స్పష్టం చేశారు.

ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ7 సదస్సు సందర్భంగా  ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్‌తో కుదిరిన శాంతి ఒప్పందం ప్రపంచానికి ఎంతో మేలు చేస్తుందని అన్నారు. హార్ముజ్ జలసంధిలో చమురు రవాణా కొంతకాలంగా అంతరాయం ఎదుర్కొన్నప్పటికీ.. ఇరాన్ ఒప్పందంతో పరిస్థితులు మెరుగుపడతాయని తెలిపారు. “మేము కుదుర్చుకున్న ఇరాన్ ఒప్పందం ప్రపంచానికి ఎంతో విజయాన్ని తీసుకువస్తుంది. హార్ముజ్ జలసంధిలో చమురు రవాణా కొంతకాలం ఇబ్బందులు ఎదుర్కొంది. ఇప్పుడు పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయి” అని ట్రంప్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. “మీ సహాయానికి ధన్యవాదాలు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్” అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. అలాగే ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై కూడా స్పందించారు. “నిన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లతో చాలా మంచి సంభాషణ జరిగింది. ఏదైనా పరిష్కారం సాధించే అవకాశం కనిపిస్తోంది. ఇద్దరూ చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు నాకు అనిపిస్తోంది” అని చెప్పారు. ఇరాన్ సంక్షోభం దాదాపు ముగిసిన నేపథ్యంలో ఇక తమ దృష్టి ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ముగించే దిశగా మళ్లుతుందని ట్రంప్ వెల్లడించారు. “ఇప్పుడు ఈ సమస్య (ఇరాన్ సంక్షోభం) ముగిసిన తర్వాత మేము ఉక్రెయిన్ అంశంపై దృష్టి సారిస్తాం. ఆ సమస్యకు కూడా పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తాం” అని పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇరాన్ ఒప్పందం, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా తదుపరి వ్యూహంపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

జీ 7 సదస్సులో భాగంగా ప్రధాని మోడీతో ట్రంప్ సమావేశం కానున్నారు. రేపటి నుంచి రెండ్రోజులు మోడీ ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక గతేడాది వైట్‌హౌస్‌లో ట్రంప్‌ను మోడీ కలిశారు. అయితే వాణిజ్య సుంకాలు కారణంగా ఇరు దేశాల మధ్య విభేదాలు రావడంతో సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రస్తుతం మళ్లీ సంబంధాలు మెరుగుపడ్డాయి. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌లో ట్రంప్‌తో మోడీ భేటీకానున్నారు. ఈ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.