Reading Time: 2 minutes
Pawan Kalyan Highlights National Unity And Viksit Bharat Vision At Sena Prasthanam Meeting

Pawan Kalyan: దేశ రాజధాని ఢిల్లీలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సేన ప్రస్థానం – జాతీయ సమైక్యత కోసం’ సమావేశం జాతీయవాదం, దేశ సమైక్యత, వికసిత్ భారత్ లక్ష్యాలు, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం, యువత ఆకాంక్షలు వంటి కీలక అంశాలపై విస్తృత చర్చలకు వేదికగా నిలిచింది. జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి వచ్చిన పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి, సుపరిపాలన, జాతీయ భద్రత రంగాల్లో సాధించిన పురోగతిని ప్రస్తావించారు. గత 12 ఏళ్ల పాలన ప్రతి భారతీయుడిలో భరోసా, విశ్వాసాన్ని పెంపొందించిందని అభిప్రాయపడ్డారు. వికసిత్ భారత్-2047 లక్ష్యంతో దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను కొనియాడారు.

* రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్ సురక్షితమైన, బలమైన దేశంగా ఎదిగిందన్నారు. డిజిటలైజేషన్, ఆర్థిక అభివృద్ధి, మహిళా సాధికారత, యువతకు అవకాశాల కల్పనలో కేంద్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని పేర్కొన్నారు. మోడీ అడుగుజాడల్లో పవన్ కల్యాణ్ జాతీయవాద దిశగా ప్రయాణిస్తున్నారని తెలిపారు.

* మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ, రాజకీయాలు జాతి నిర్మాణం కోసం ఉండాలని పవన్ కల్యాణ్ నమ్ముతున్నారని చెప్పారు. కులం, మతం, ప్రాంతీయత పేరుతో ప్రజలను విభజించడం కాకుండా దేశ ప్రజలందరినీ ఏకం చేయడమే ఆయన లక్ష్యమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి పౌరుడు వినియోగించుకునే స్వేచ్ఛ ఉండాలని అన్నారు.

* కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, జనసేన పార్టీకి దేశ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. పార్టీ కంటే దేశం, ప్రజల భద్రత, సంక్షేమమే ముఖ్యమనే సిద్ధాంతంతో జనసేన ముందుకు సాగుతోందన్నారు. భారతదేశ వైవిధ్యమే దేశ బలమని, ఆ భావనను బలోపేతం చేయడమే ఈ సమావేశం ఉద్దేశమని చెప్పారు.

* జనసేన ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు మాట్లాడుతూ, జనసేన బలమైన సిద్ధాంతాలపై నిర్మితమైన పార్టీ అని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ పార్టీని ఏడు ప్రధాన సిద్ధాంతాల ఆధారంగా ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. ప్రజల సమస్యలపై పోరాటం, దేశభక్తి, జాతీయ సమైక్యత వంటి అంశాలు జనసేనకు మూల సూత్రాలని వివరించారు.

* అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ, ప్రస్తుతం రాజకీయాల్లో అధికారం కోసం పోటీ ఎక్కువగా కనిపిస్తున్న సమయంలో దేశం ఎలా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో పనిచేసే నాయకులు అరుదుగా ఉంటారని అన్నారు. అలాంటి నాయకత్వానికి పవన్ కల్యాణ్ నిదర్శనమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి, పెట్టుబడుల సాధనలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు.

ఇక, సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ, దేశ సమైక్యతకు ముప్పు కలిగించే విభజనవాద శక్తులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. ‘నేషన్ ఫస్ట్’ సిద్ధాంతంతో దేశ ప్రజలందరినీ ఏకం చేసే దిశగా పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు తెలిపారు. జనసేన పార్టీ 12 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తు చేస్తూ, సామాజిక మార్పు, నైతిక రాజకీయాలు, ప్రజా సేవ అనే లక్ష్యాలతో ప్రారంభమైన పార్టీ నేడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో జనసేన దక్షిణ భారతదేశంలో మరింత బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.