
మహారాష్ట్ర రాజధాని ముంబైలో తీవ్ర నీటి సంక్షోభం నెలకొంది. రుతుపవనాలు రాకపోవడంతో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. దీంతో ప్రభుత్వం నీటి సరఫరాపై ఆంక్షలు విధించింది. ప్రస్తుతం జలాశయాల్లో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. దీంతో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కఠిన ఆంక్షలు విధించింది. తాగునీటిని వృథా చేసినా, దుర్వినియోగం చేసినా జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది. జూన్ 16 నాటికి ముంబైకి నీటిని అందించే సరస్సుల్లో మొత్తం నీటి నిల్వలు కేవలం 10.35 శాతానికి మాత్రమే పడిపోయాయని బీఎంసీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమల్లో ఉన్న 10 శాతం నీటి కోతను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, క్రీడా క్లబ్లకు సరఫరా చేసే నీటిలో 20 శాతం కోత విధించింది.
కొత్త కనెక్షన్లకు బ్రేక్
ప్రస్తుతం కొత్త నిర్మాణ ప్రాజెక్టులకు ఎలాంటి నీటి కనెక్షన్లు మంజూరు చేయబోమని బీఎంసీ స్పష్టం చేసింది. నిర్మాణ స్థలాలకు ఇచ్చిన తాత్కాలిక నీటి కనెక్షన్లను కూడా తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇక తాగునీటిని ఉపయోగించి కార్లు కడగడం, తోటలకు నీరు పెట్టడం, రోడ్లు శుభ్రం చేయడం వంటి కార్యకలాపాలపై పూర్తిగా నిషేధం విధించింది. ఈ అవసరాల కోసం బోర్వెల్లు లేదా బావుల నీటిని వినియోగించాలని ప్రజలకు సూచించింది.
నగరంలోని అన్ని స్విమ్మింగ్ పూల్లకు నీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసింది. అలాగే ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, మినరల్ వాటర్ తయారీ యూనిట్లకు నీటి సరఫరాను కూడా పరిమితం చేసింది. కార్మికుల తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని అందించనున్నారు. వెస్ట్రన్ రైల్వే, సెంట్రల్ రైల్వే, ఆర్సీఎఫ్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఎంఐడీసీతో పాటు భారత నౌకాదళం వంటి భారీ సంస్థలు తమ కార్యకలాపాల కోసం తప్పనిసరిగా శుద్ధి చేసిన మురుగునీరు లేదా రీసైకిల్ చేసిన నీటినే ఉపయోగించాలని ఆదేశించింది.
ముంబై నగర తాగునీటి సరఫరా పూర్తిగా వర్షాలపై ఆధారపడి ఉంటుంది. అప్పర్ వైతర్ణా, మోడక్ సాగర్, తన్సా, మిడిల్ వైతర్ణా, భత్సా, విహార్, తులసి అనే ఏడు ప్రధాన జలాశయాల నుంచి నగరానికి నీరు సరఫరా అవుతోంది. అయితే ఈ ఏడాది ఆలస్యమైన రుతుపవనాల కారణంగా నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో నీటి వినియోగంపై మరింత జాగ్రత్తగా ఉండాలని బీఎంసీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ముంబై సరఫరా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో, కార్ వాష్కు అనుమతి లేదు, నీటి దుర్వినియోగంపై జరిమానాముంబైకి నీటిని సరఫరా చేసే సరస్సులలో మొత్తం నీటి నిల్వలు జూన్ 16 నాటికి 10.35 శాతం అనే ప్రమాదకర స్థాయికి పడిపోయిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు బీఎంసీ మంగళవారం ఒక సర్క్యులర్లో తెలిపింది.