
హైదరాబాద్: హైదరాబాద్ బంజారాహిల్స్లో తాగునీటిని వృథా చేసిన వ్యక్తికి జలమండలి 10 వేల జరిమానా విధించింది. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి క్షేత్ర స్థాయి తనిఖీల్లో ఈ ఘటన బయటపడింది. ఖైరతాబాద్ పరిధిలో సీవరేజ్ సమస్యల పరిశీలన సందర్భంగా ఈ ఘటనను గుర్తించారు.
ఆనంద్నగర్ కాలనీలో ఓవర్ హెడ్ ట్యాంక్ ఓవర్ ఫ్లోతో తాగునీరు వృథా అవుతుంది. తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించడంపై జలమండలి ఎండీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత ఇంటి యజమానికి నోటీసు జారీ చేయాలని ఆదేశించారు.
జలమండలి ఎండీ ఆదేశాల మేరకు అధికారులు సదరు ఇంటి యజమానికి 10 వేల ఫైన్ విధించారు. జలమండలి సరఫరా చేసే తాగునీటిని బాధ్యతగా వినియోగించాలని సూచించారు. తాగునీటి వృథాను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నీటి సంరక్షణలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని జలమండలి విజ్ఞప్తి చేశారు. తాగునీటి దుర్వినియోగంపై జలమండలి అధికారులు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు.