Reading Time: < 1 minute
Cm Chandrababu Naidu Holds Key Investment And Development Meetings On Day Two Of Singapore Visit

CM Chandrababu Singapore Visit: సింగపూర్‌లో రెండో రోజు పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు అనగా మంగళవారం రోజు వివిధ కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ, అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రణాళికలు, సెమీకండక్టర్ రంగ విస్తరణే లక్ష్యంగా పలు అంతర్జాతీయ ప్రతినిధుల బృందాలు, ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు చర్చలు జరపనున్నారు. వరల్డ్ సిటీస్ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి కీలకోపన్యాసం చేయనున్నారు. ఆసియా-పసిఫిక్ సెమికాన్ ఎకోసిస్టమ్‌పై నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతారు. తర్వాత సుర్బానా జురాంగ్ ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు. పట్టణాభివృద్ధి ప్రణాళికలపై సుర్బానా జురాంగ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, నిపుణులతో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చిస్తారు.

ఇక, మధ్యాహ్నం సింగపూర్ ఉప ప్రధాని, వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి గాన్ కిమ్ యాంగ్, విదేశాంగ శాఖ సహాయ మంత్రి గాన్ సియో హువాంగ్, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు సీఎం చంద్రబాబు నాయుడు… అలాగే వరల్డ్ సిటీస్ సమ్మిట్‌లో లీడర్‌షిప్ ప్లీనరీ-2 విభాగంలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. వరల్డ్ సిటీస్ సమ్మిట్ ఎగ్జిబిషన్ స్టాళ్లు, సింగపూర్ పెవిలియన్, గూగుల్ స్టాళ్లను పరిశీలిస్తారు. సాయంత్రం సీట్రియం ప్రతినిధులతో సమావేశమై పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ఎనర్జీ, మెరైన్ రంగాలపై చర్చిస్తారు. అనంతరం ఐహెచ్‌సీ, సీఐఐ పీఎస్ 2026 బిజినెస్ రోడ్‌షోలో పాల్గొని ఏపీ వ్యాపార ప్రతినిధుల బృందంతో కలిసి పెట్టుబడిదారులతో ముఖాముఖి చర్చిస్తారు. దీంతో రెండు రోజుల సింగపూర్ పర్యటన ముగుస్తుంది. ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమాల్లో మంత్రి నారాయణ, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.. రేపు రాత్రికి సింగపూర్ నుంచి తిరుగు ప్రయాణమై సీఎం చంద్రబాబు స్వదేశానికి చేరుకుంటారు.