
Telegram Banned: నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్ను భారత్లో తాత్కాలిక బ్యాన్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. జూన్ 21న జరగనున్న నీట్ పరీక్ష, దాని తర్వాత ప్రశ్నాపత్రం లీకులు, తప్పుడు ప్రచారం, మోసాలనున అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. జూన్ 22 వరకు టెలిగ్రామ్ సేవల్ని భారత్లో పరిమితం చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) సిఫారసుల మేరకు కేంద్రం ఈ చర్యలు తీసుకుంది. ఇప్పటికే గూగుల్ ప్లే స్టోర్ నుంచి టెలిగ్రామ్ యాప్ ను తొలగించింది. ఆపిల్ కూడా ఇదే విధమైన చర్యలు తీసుకోనుంది.
అయితే, ఈ నిర్ణయంపై టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ స్పందించారు. కొందరు వ్యక్తులు ఎగ్జామ్ పేపర్స్ లీకులకు పాల్పడితే, 150 మిలియన్లకు పైగా భారతీయ టెలిగ్రామ్ యూజర్లను శిక్షంచడం సరైన చర్య కాదని అన్నారు. ‘‘ టెలిగ్రామ్ నిషేధించిన లీకులు ఆగవు. అవి ఇతర యాప్లకు మారుపోతాయి. అసలు సమస్య పరిష్కరించకుండా సాధారణ వినియోగదారులపై భారం మోపుతున్నారు. ’’ అని దురోవ్ ఎక్స్లో ట్వీట్ చేశారు.
ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ మాట్లాడుతూ.. నీట్ పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగకుండా నిర్వహించడమే తమ లక్ష్యమని చెప్పారు. ప్రస్తుతం కొత్త ప్రశ్నాపత్రం లీక్ కాలేదని, సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం కావడంతో విద్యార్థుల్లో ఆందోళన పెరిగిందని చెప్పారు.