
Vaibhav Sooryavanshi: భారత యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ కెరీర్లో ఒక అద్భుతమైన మలుపు తిరగబోతున్న సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. లంక వేదికగా జరిగిన ఓ అనూహ్య సంఘటన అతడిని వివాదంలోకి నెట్టింది. ఈ నెలాఖరులో ఐర్లాండ్తో జరగబోయే టీ20 సిరీస్ ద్వారా సీనియర్ జట్టులోకి అరంగేట్రం చేయడానికి ముందే, మానసికంగా మరింత దృఢంగా మారాలనే ఉద్దేశంతో వైభవ్ శ్రీలంక పర్యటనకు వెళ్లాడు. మొదట్లోనే ఓ గొడవతో హైలెట్ అయ్యాడు. ఐపీఎల్ 2026 సీజన్లో రికార్డు స్థాయి ప్రదర్శనతో సెలక్టర్లను ఆకర్షించిన ఈ 15 ఏళ్ల యువ ఆటగాడు, ఏకంగా మూడు టీ20 సిరీస్లకు ఎంపికయ్యాడు. అయితే, సోమవారం శ్రీలంక ‘ఎ’ జట్టుతో జరిగిన ట్రై-సిరీస్ మ్యాచ్లో భారత్ ‘ఎ’ జట్టు సూపర్ ఓవర్లో ఓటమి పాలైన తర్వాత, వైభవ్ లంక ఆటగాడితో భౌతిక దాడికి దిగడం తీవ్ర చర్చనీయాంశమైంది.
సూపర్ ఓవర్లో గెలవడానికి 17 పరుగులు కావాల్సిన తరుణంలో కగుథా మథులన్ (Kagutha Mathulan)బౌలింగ్లో భారత్ కేవలం 9 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ సూపర్ ఓవర్లో వైభవ్ ఎదుర్కొన్న మూడు బంతుల్లో ఒక ఫోర్తో సహా 6 పరుగులు చేసినప్పటికీ భారత్కు ఓటమి తప్పలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత లంక ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోగా, వైభవ్, అతని భాగస్వామి సూర్యాంశ్ షెడ్జ్ పెవిలియన్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో మథులన్తో సహా కొందరు లంక ఆటగాళ్లతో జరిగిన మాటల యుద్ధం కాస్తా శృతిమించింది. ఆగ్రహంతో ఊగిపోయిన వైభవ్, ఒక శ్రీలంక ఆటగాడిని చేతులతో నెట్టేయడం టీవీ విజువల్స్లో స్పష్టంగా కనిపించింది. లంక సీనియర్ ప్లేయర్ నిరోషన్ డిక్వెల్లా సకాలంలో జోక్యం చేసుకుని వైభవ్ను పక్కకు లాగడంతో గొడవ పెద్దది కాకుండా ఆగింది. అయినప్పటికీ వైభవ్ తీవ్ర కోపంతో లంక ఆటగాళ్ల వైపు సైగలు చేస్తూనే వెనుదిరిగాడు. ఇక్కడే సీనియర్లు, క్రికెట్ నిపుణులు వైభవ్ శైలిపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఓ మంచి ప్లేయర్కి కావాల్సింది కేవలం ఆట మాత్రమే కాదు.. క్రమశిక్షణ, సహనం ఎంతో ముఖ్యం. ఇక నుంచైనా క్రమశిక్షణగా మెలగాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇక, ఈ మ్యాచ్లో వైభవ్ ఇలా సహనం కోల్పోవడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు లంక సూపర్ ఓవర్ ఇన్నింగ్స్ ఆఖరి బంతికి అంపైర్ నో-బాల్ ఇవ్వడంపై భారత కెప్టెన్ తిలక్ వర్మ అసంతృప్తి వ్యక్తం చేయగా, అప్పటికే ప్యాడ్లు కట్టుకుని సిద్ధంగా ఉన్న వైభవ్ సైతం నేరుగా మైదానంలోకి వెళ్లి అంపైర్తో వాదనకు దిగాడు. ఆ తర్వాత హెడ్ కోచ్ హృషికేష్ కనిట్కర్ జోక్యం చేసుకుని అతడిని పక్కకు తీసుకురావాల్సి వచ్చింది. ఈ వివాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియరాలేదు కానీ, వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు ఐసీసీ క్రమశిక్షణా చర్యలను ఎదుర్కొనే ప్రమాదంలో పడ్డాడు. గతంలో 2024 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఇలాగే మైదానంలో దూకుడుగా ప్రవర్తించి, తోటి ఆటగాడిని ఢీకొట్టినందుకు విరాట్ కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానాతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ను ఐసీసీ విధించింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆర్టికల్ 2.12 ప్రకారం.. అంతర్జాతీయ మ్యాచ్ల సమయంలో ఆటగాళ్లు, అంపైర్లు లేదా ఇతర సిబ్బందితో అనుచితంగా భౌతికంగా ఘర్షణ పడటం తీవ్రమైన నేరం. ఈ నేపథ్యంలో మ్యాచ్ రెఫరీ ప్రదీప్ జయప్రగాష్ ఈ యువ ఆటగాడికి కేవలం హెచ్చరికతో వదిలేస్తారా లేక అధికారికంగా జరిమానా విధిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. సీనియర్ జట్టులోకి అడుగుపెడుతున్న వేళ ఇలాంటి వివాదాలు వైభవ్ భవిష్యత్తుపై ప్రభావం చూపకుండా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఏది ఏమైనా భవిష్యత్తు సాఫీగా సాగాలంటే అంతకోపం పనికి రాదు..