Reading Time: < 1 minute
Weather Alert:ఓవైపు వర్షాలు.. మరోవైపు ఎండలు! నేడు ఏ జిల్లాల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది?

ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచన జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు సోమవారం నాటికి ఆంధ్రప్రదేశ్‌ అంతటా విస్తరించాయని, వీటి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడి వర్షాలు కురవనుండగా.. మరికొన్ని చోట్ల ఎండల ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మంగళవారం (16-06-26) విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వెల్లడించారు. కోస్తాంధ్ర మిగతా జిల్లాలు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

మరోవైపు ఎండ ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని, గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదని సూచించారు.

అలాగే ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద,భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని సూచించారు. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ వీలైనంత దూరంగా ఉండాలన్నారు. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేసే రైతులు,శ్రామికులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు.

సోమవారం వాతావరణం ఇలా

సొమవారం సాయంత్రం 5 గంటల నాటికి అనకాపల్లి జిల్లా కన్నూరుపాలెంలో 45.2మిమీ, మన్యం జిల్లా బలిజిపేటలో 42.7, అనకాపల్లి జిల్లా వెంకన్నపాలెంలో 37.5, మన్యం జిల్లా చిలకలపల్లిలో 35.2, విజయనగరం జిల్లా బొబ్బిలిలో 26.7మిమీ, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 24మిమీ చొప్పున వర్షపాతం రికార్డైందన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.